Bisleri deal | గోల్డ్ స్పాట్, లిమ్కా, థమ్స్ అప్ కూల్డ్రింక్స్ను కోకాకోలాకు విక్రయించి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు బిస్లెరీని అమ్మకానికి పెట్టారు ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్. బిస్లెరీ ఇంటర్నేషన్ను టాటా కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దాదాపు రూ.6000-7000 కోట్ల ఒప్పందం జరుగుతున్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తున్నది. తన కూతురు బిస్లెరీ వాటర్ బిజినెస్ చూసుకోననడం వల్లనే అమ్మేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు రమేశ్ చౌహాన్ చెప్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. బిస్లెరీ ఇంటర్నేషనల్ కింద బిస్లెరీ మినరల్ వాటర్తోపాటు హిమాలయన్ స్ప్రింగ్ వాటర్, ఫ్రీజ్ డ్రింక్, హ్యాండ్ ప్యూరిఫయర్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి.
తాను నెలకొల్పిన వ్యాపారాన్ని విస్తరించడానికి వారసుడు లేడు. అందుకే బిస్లరీని మరింత ఉన్నత స్థాయి విస్తరణకు తీసుకెళ్లే ఆలోచన చేయలేదని 82 ఏండ్ల వయసున్న రమేశ్ చౌహాన్ చెప్పాడు. ఫ్యాషన్ డిజైనర్గా ఉన్న కూతురు జయంతికి బిస్లెరీ వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదంట. ఆమెను ఇబ్బందిపెట్టే ఉద్దేశం లేకపోవడం వల్ల టాటా కంపెనీతో విక్రయ ఒప్పంద చర్చలు జరుపుతున్నట్లు రమేశ్ చౌహాన్ చెప్పారని సమాచారం. బిస్లెరీని కొనుగోలు చేసేందుకు రిలయన్స్ రిటైల్, నెస్లే, డానోన్ వంటి సంస్థలు కూడా సిద్ధంగా ఉన్నట్లు మార్కెట్ల వర్గాల సమాచారం. భారతదేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీగా బిస్లెరీ ఉన్నది. వీరి ఒప్పందం ప్రకారం ప్రస్తుతం ఉన్న మేనేజిమెంట్ మరో రెండేండ్ల పాటు కొనసాగుతుంది.
బిస్లరీలో మైనార్టీ వాటాను కూడా ఉంచుకోనని చౌహాన్ తెలిపారు. ఇదే సమయంలో, బాటిల్ వాటర్ వ్యాపారం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటర్ హార్వెస్టింగ్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ వంటి పర్యావరణ కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నట్లు రమేశ్ తన మనసులోని మాటను వెల్లడించారు. కేవలం రూ.4 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన బిస్లెరీ.. ఇప్పుడు రూ.7000 కోట్లకు విస్తరించడం వెనక రమేశ్ చౌహాన్ కృషి ఎంతగానో ఉన్నది.