హైదరాబాద్ జూలై 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగ సంస్థ రఘువంశీ ఏరోస్పేస్ గ్రూప్ (ఆర్వీఏజీ) తన విస్తరణ ప్రణాళికలకు ఊతమిస్తూ 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) సమీకరించింది. దీనికి నార్వెస్ట్, స్కేగెన్ అసెట్ మేనేజ్మెంట్ నేతృత్వం వహించగా.. ఇండస్ బ్రిడ్జి వెంచర్స్, జీజేఎన్ఎక్స్ వెంచర్స్, ప్రముఖ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా పెట్టుబడులు పెట్టారు. ఈ నిధులను భారత్, యూకే, అమెరికాలోని తయారీ కేంద్రాల విస్తరణకు వినియోగించనున్నట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ వికాస్ వెల్లడించారు.
అలాగే హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హార్డ్వేర్ పార్లో నిర్మిస్తున్న సమగ్ర తయారీ క్యాంపస్, మిషన్ సిస్టమ్స్, డీప్-టెక్ అండ్ అటానమస్ సిస్టమ్స్ వ్యాపారాల అభివృద్ధికి ఈ పెట్టుబడులు ఉపయోగపడనున్నాయని చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రఘు వంశీ ఏరోస్పేస్ గ్రూప్.. ప్రస్తుతం 3 దేశాల్లో 10కిపైగా తయారీ యూనిట్లు, 1,200 మందికిపైగా ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తోంది.
ప్రస్తుతం ఈ సంస్థ వద్ద రూ.2,500 కోట్లకు పైగా ఆర్డర్ బుక్ ఉన్నది. హార్డ్వేర్ పార్ ప్రాజెక్టును వేగవంతం చేసి, స్వదేశీ మిషన్ సిస్టమ్స్, అటానమస్ సిస్టమ్స్ అభివృద్ధిపై మరింత దృష్టి సారిస్తామని ఎండీ వంశీ వికాస్ తెలిపారు. సంస్థ సీఈవో శివ అరవింద్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఐఐటీలు, ట్రిపుల్ఐటీలు, ఏఆర్సీఐ, డీఆర్డీఓ, ఏడీఏ వంటి ప్రముఖ విద్యా, పరిశోధనా, రక్షణ సంస్థలతో భాగస్వామ్యాలు కొనసాగిస్తూ స్వదేశీ ఏరోస్పేస్ సాంకేతికతల అభివృద్ధికి కృషి చేస్తోందని వెల్లడించారు.