న్యూఢిల్లీ, అక్టోబర్ 6: బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పట్టణ సహకార బ్యాంక్లు బంగారంపై ఇచ్చే రుణాల పరిమితిని రిజర్వ్బ్యాంక్ రెట్టింపు చేసింది. గతంలో ఈ పరిమితి రూ.2 లక్షలు ఉండగా, ఇప్పుడు రూ.4 లక్షల వరకూ పెంచింది. అయితే 2023 మార్చి 31నాటికి ప్రాధాన్యత రంగ రుణాల లక్ష్యాలను (పీఎస్ఎల్) పూర్తిచేసిన సహకారం బ్యాంక్లకే ఈ పెంపు సదుపాయం వర్తిస్తుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
ఇటీవల పట్టణ సహకార బ్యాంక్ల చీఫ్లతో సమావేశమైన దాస్..పీఎస్ఎల్ లక్ష్యాల్ని పూర్తిచేసిన బ్యాంక్లకు ‘తగిన ప్రోత్సాహకాలు’ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తాజా రుణ వితరణ అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని పొందిన బ్యాంక్లు పీఎస్ఎల్ లక్ష్యాలు, ఉపలక్ష్యాల సాధనను కొనసాగించాల్సి ఉంటుందని, ఈ అంశంపై సవివరమైన మార్గదర్శకాలను ప్రత్యేకంగా జారీచేయనున్నట్టు ఆర్బీఐ తెలిపింది.
బంగారంపై తీసుకున్న రుణం కాలపరిమితి ముగిసినపుడే పూర్తిగా అసలు, వడ్డీ మొత్తాన్ని ఒకేదఫా చెల్లించే వీలును కల్పించేదే బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్. ఈఎంఐ షెడ్యూల్ పాటించడం, పాక్షిక చెల్లింపులు చేయడం వంటి ఆందోళనలు బంగారం రుణాలు తీసుకున్నవారికి ఉండవు. ఈ రుణంపై వడ్డీ రేటును ప్రతీ నెలా లెక్కిస్తారు. కానీ కాలపరిమితి ముగిసిన తర్వాత అసలు, వడ్డీ కలిపి చెల్లిస్తే చాలు. బుల్లెట్ రీపేమెంట్ పూర్తిచేసినవారు తనఖా చేసిన బంగారాన్ని వెనక్కు తీసుకోవచ్చు లేదా రోలోవర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ ఈ రుణాల గరిష్ఠ కాలపరిమితి 12 నెలలు. రోలోవర్ చేసుకుంటే చెల్లించిన మరుసటి రోజే కొత్త రుణాన్ని తీసుకోవచ్చు.