న్యూఢిల్లీ, జూలై 12: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ప్రీమియం ఆదాయం భారీగా తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో ఎల్ఐసీ ప్రీమియం వసూళ్లు 7 శాతం క్షీణించి రూ. 44,837 కోట్లకు పడిపోయింది. నిరుడు ఇదే త్రైమాసికంలో సంస్థ ప్రీమియం ఆదాయం 35 శాతం భారీ వృద్ధితో రూ. 48,201 కోట్లకు చేరగా, తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో తగ్గడం గమనార్హం.
వ్యక్తిగత సింగిల్ ప్రీమియం ఆదాయం రూ.4,633.2 కోట్ల నుంచి రూ. 4,568 కోట్లకు తగ్గగా, గ్రూప్ సింగిల్ ప్రీమియం ఆదాయం రూ. 36,144 కోట్ల నుంచి రూ 33,465 కోట్లకు తగ్గింది. ప్రైవేటుతో కలుపుకుని దేశంలోని మొత్తం జీవిత బీమా సంస్థల ఆదాయం 0.9 శాతం తగ్గుదలతో రూ. 73,005 కోట్లుగా నమోదైనట్టు కేర్ రేటింగ్స్ తెలిపింది. ప్రైవేటు కంపెనీల ప్రీమియం ఆదాయం 10.6 శాతం వృద్ధితో రూ. 25,473 కోట్ల నుంచి రూ. 28,168 కోట్లకు పెరిగింది.