Inflation | కేంద్ర ప్రభుత్వం చురుగ్గా చర్యలు చేపట్టడం వల్లే ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయికి దిగి వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. గురువారం వచ్చే ఆర్థిక సంవత్సరా (2024-25) తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశ పెడుతూ ఈ సంగతి వెల్లడించారు. ద్రవ్యోల్బణం దిగి వచ్చిందని తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రణ స్థాయి 4-2 శాతం మధ్యకు తీసుకు రావాలని ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు.
డిసెంబర్ నాటికి గత నాలుగు నెలలుగా శరవేగంగా రిటైల్ ద్రవ్యోల్బణం 5.69 శాతానికి పెరుగుతూ వచ్చింది. దీనికి కూరగాయలు, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరగడమే కారణమని అన్నారు. ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో 2022తో పోలిస్తే గత నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.72 నుంచి 5.55 శాతానికి దిగి వచ్చిందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) తెలిపింది. 2022 డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం 4.19 శాతం ఉంటే 2023 డిసెంబర్ నెలలో 8.7 శాతానికి పెరిగిందని పేర్కొంది. గత ఆగస్టు రిటైల్ ద్రవ్యోల్బణం 6.83 శాతం ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరింది.