న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ చందా ఆధారిత పొదుపు ఖాతాల్ని ఆవిష్కరించింది. తాము కొత్తగా ప్రారంభించిన పెయిడ్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్న ఖాతాదారు బ్యాంక్ అందించే పలు సేవలకు చార్జీలు చెల్లించాల్సిన పనిలేదని, కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్ బ్యాంక్ మంగళవారం తెలిపింది.
ఈ అకౌంట్ కోసం ఖాతాదారులు నెలకు రూ. 150 చొప్పున లేదా సంవత్సరానికి రూ.1,650 చందా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. దేశీయంగా జరిపే లావాదేవీలకు ఫీజు ఉండదని, ఉచిత డెబిట్ కార్డులు ఆఫర్ చేస్తామని, ఎన్ని దఫాలైనా ఏటీఎంలను ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ వివరించింది. చెక్కు బుక్ల వాడకంపై చార్జీలు ఉండవని, పరిమితిని మించి లావాదేవీలు/విత్డ్రాయిల్స్ జరుపుకోవచ్చని యాక్సిస్ తెలిపింది.