న్యూయార్క్ : ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్తో కలిసి లంచ్ చేయడం మామూలు విషయం కాదు. బెర్క్షైర్ హాథ్వే అధిపతితో ప్రైవేట్ లంచ్ కోసం బడా బాబులు క్యూ కడుతుంటారు. వారెన్ బఫెట్తో కలిసి భోంచేసేందుకు ఈబే వేలంలో ఓ వ్యక్తి ఏకంగా 19 మిలియన్ డాలర్లు (దాదాపు రూ .140 కోట్లు) చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. కాలిఫోర్నియా ఛారిటీకి విరాళంగా ఇచ్చేందుకు వారెన్ బఫెట్తో 21వ సారి లంచ్ కోసం వేలంలో ఓ బిడ్డర్ ఈబేలో 19 మిలియన్ డాలర్లు కోట్ చేశాడు.
2019 నుంచి బఫెట్ తొలిసారిగా ప్రైవేట్ లంచ్ను ఆఫర్ చేస్తుండగా కరోనా మహమ్మారి కారణంగా గత రెండేండ్లుగా వేలం రద్దయింది. వేలంలో గెలుపొందిన బిడ్డర్ తాను ఆహ్వానించిన మరో ఏడుగురు అతిధులతో బఫెట్తో కలిసి విందు ఆరగిస్తారు. న్యూయార్క్లో బఫెట్కు ఇష్టమైన రెస్టారెంట్లలో ఒకటైన స్మిత్ అండ్ వాలెన్స్కైలో లంచ్ ఏర్పాట్లు చేస్తారని ఈబే తెలిపింది. పేదరికం, సామాజిక న్యాయం వంటి అంశాలపై పనిచేసే గ్లైడ్ ఫౌండేషన్కు లంచ్ వేలం ద్వారా సమకూరిన మొత్తాన్ని అందచేస్తారు.
2000లో వేలం మొదలైనప్పటి నుంచి వారెన్ బఫెట్ ఇప్పటివరకూ గ్లైడ్ ఫౌండేషన్కు 34.5 మిలియన్ డాలర్లు సమకూర్చారు. తన జీవితకాలంలో తన సంపదలో 99 శాతం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తానని బఫెట్ హామీ ఇచ్చారు. సొంత ఫౌండేషన్ స్ధాపించేందుకు ఆసక్తి చూపని బఫెట్ తన సంపదను బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ వంటి ఇతరులు నిర్వహించే ఐదు ఫౌండేషన్లకు ఛారిటీగా అందచేస్తున్నారు.