న్యూఢిల్లీ, జనవరి 2: కొత్త నిబంధనలు అమలులోకి వచ్చినందున రిఫ్రిజిరేటర్ల ధరలు పెరగనున్నాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీసియన్సీ (బీఈఈ) లేబులింగ్ నిబంధనలు ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తించనున్నాయి. దీంతో ఆయా మోడల్స్కు అనుగుణంగా 2-5 శాతం వినియోగదారులపై భారం పడుతుందని గోద్రేజ్ అప్లియెన్సెస్, హయర్, పానాసోనిక్ తదితర తయారీ సంస్థల ప్రతినిధులు చెప్పారు.
ఇంధన సామర్థ్యానికి సంబంధించిన కొత్త నిబంధనల ప్రకారం ఫ్రాస్ట్ ఫ్రీ మోడల్స్లో ఫ్రీజర్లు, రిఫ్రిజిరేటర్ ప్రొవిజినింగ్ యూనిట్స్ (స్టోరేజ్ పార్ట్)కు ప్రత్యేక స్టార్ లేబులింగ్ తప్పనిసరి. దీంతో స్టార్ లేబులింగ్కు అనుగుణంగా మెరుగైన ఇన్సులేషన్ ద్వారా ఆయా ఇంధన సామర్థ్యాన్ని సాధించేందుకు ఉత్పాదక వ్యయం కొంత పెరుగుతుందని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది తెలిపారు. వివిధ మోడళ్లు, వాటి స్టార్ రేటింగ్ల మేర తమ ఉత్పత్తుల ధరలు 2-3 శాతం వరకూ పెరుగుతాయన్నారు.
సవరించిన బీఈఈ నిబంధనల ప్రకారం రిఫ్రిజిరేటర్ల ఇంధన సామర్థ్యం మారుతుందని, తమ ఉత్పత్తుల ధరలు 2-4 శాతం మేర పెరుగుతాయని హయర్ అప్లియెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ ఎన్ఎస్ తెలిపారు. కొత్త లేబులింగ్ అమలుతో పెరిగిన వ్యయాన్ని వినియోగదారులకు మళ్లిస్తామని పానాసోనిక్ మార్కెటింగ్ ఇండియా ఎండీ ఫుమియాసు ఫుజిమోరి తెలిపారు. పానాసోనిక్ రిఫ్రిజిరేటర్ల ధరలు 5 శాతం వరకూ పెరగవచ్చన్నారు.