మళ్లీ కొండెక్కిన కూరగాయలు వినియోగ ధరల సూచీలో ప్రధానభాగమైన ఆహార పదార్థాల ధరలు 2023 డిసెంబర్లో అంతక్రితం ఏడాది ఇదేనెలతో పోలిస్తే 9.53 శాతం పెరిగాయి. నవంబర్ నెలలో మొత్తంగా ఆహారోత్పత్తుల పెరుగుదల 8.7 శాతంకాగా, 2022 డిసెంబర్లో 4.9 శాతం. సమీక్షా నెలలో ఫుడ్ బాస్కెట్లోని కూరగాయల ధరలు భారీగా 27.64 శాతం ఎగిసాయి. పప్పు దినుసుల ధరలు 20.73 శాతం, మసాలా దినుసుల ధరలు 19.69 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు వంటనూనెల ద్రవ్యోల్బణం మాత్రం 14.96 శాతం తగ్గింది.
న్యూఢిల్లీ, జనవరి 12: కొద్దికాలంపాటు ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. 2023 డిసెంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరింది. ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు పెరుగుదల ఇందుకు కారణం. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారంగా లెక్కించే రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్ నెలలో 5.55 శాతంకాగా, 2022లో ఇదే నెలలో ఇది 5.72 శాతం. 2023 ఆగస్టు నెలలో 6.83 శాతానికి పెరిగిన తర్వాత మళ్లీ ఇంత గరిష్ఠస్థాయిలో నమోదుకావడం డిసెంబర్ నెలలోనే.
జాతీయ గణాంకాల శాఖ శుక్రవారం విడుదల చేసిన వివరాల ప్రకారం పట్టణ ప్రాంతాలకంటే గ్రామాల్లో అధికంగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో 5.93 శాతం, పట్టణాల్లో 5.56 శాతం చొప్పున ధరలు పెరిగాయి. వడ్డీ రేట్లను రిజర్వ్బ్యాంక్ తగ్గించాలంటే రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత 2-4 శాతం శ్రేణిలోకి దిగిరావాల్సి ఉన్నది.