RC Bhargava | గతంలో ఫస్ట్ టైం కారు కొనే వారు బుల్లి కార్లకు ప్రాధాన్యమిచ్చే వారు. కానీ బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి రావడంతో బుల్లి కార్ల తయారీ ఖర్చు పెరిగిపోయింది. దీంతో 2022-23లో బుల్లి కార్ల విక్రయాలు 2018-19 సంవత్సరంలో అమ్ముడైన కార్ల కంటే రెండు లక్షలు తగ్గిపోయాయని మారుతి సుజుకి చైర్మన్ ఆర్ సీ భార్గవ చెప్పారు. 2019-20లో బీఎస్-6 ప్రమాణాలు, కొవిడ్ మహమ్మారి, సెమీ కండక్టర్స్ కొరత వల్ల కార్ల విక్రయాలు తగ్గిపోయాయని తెలిపారు. తిరిగి 2022-23లో బుల్లి కార్లు మినహా మిగతా మోడల్ కార్ల సేల్స్ సాధారణ స్థాయికి చేరాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4.13 మిలియన్ల కార్లు అమ్ముడవుతాయని ఆర్సీ భార్గవ అంచనా వేశారు. అయినా 2018-19తో పోలిస్తే నాలుగు శాతం తక్కువే అమ్ముడు పోయాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరు శాతం గ్రోత్ రికార్డవుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.
కార్ల విడి భాగాలు, సెమీ కండక్టర్ల లభ్యత మెరుగు పడటంతోపాటు కస్టమర్ల నుంచి గిరాకీ పెరగడంతో కార్ల తయారీ సంస్థల మధ్య పోటీ పెరిగింది. దీంతో కార్ల తయారీ సంస్థలు ఈవీ కార్లతోపాటు ఆకర్షణీయ ఫీచర్లతో పలుమోడల్ కార్లను మార్కెట్లోకి తెస్తున్నాయని ఆర్సీ భార్గవ అన్నారు. కానీ, బుల్లి కార్లకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ పరిశ్రమ బలహీనతలను బయట పెడుతుందన్నారు. ధరలు పెరుగుతుండటంతో మున్ముందు బుల్లి కార్లకు స్వల్పంగా డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. బీఎస్-6 ప్రమాణాలు అమల్లోకి వచ్చిన తర్వాత ద్విచక్ర వాహనాలకు గిరాకీ తగ్గినా తర్వాత డిమాండ్ పుంజుకున్నది.అలాగే బుల్లి కార్లకూ గిరాకీ పెరుగుతుందన్నారు. 2024-25లో స్వల్పంగా గిరాకీ పెరిగినా, వచ్చే ఏడాదిలోనే డిమాండ్ ఎక్కువ అవుతుందన్నారు.