Daughters on family business | మీరు ఒక వ్యాపార వేత్తగా మీ వారసుడికి లేదా వారసురాలికి కుటుంబ బిజినెస్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారా.. అయితే, ఈ స్టోరీ మీరు తప్పనిసరిగా చదవాల్సిందే. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల నుంచి మనదేశం వరకు పలు పారిశ్రామిక సంస్థలు.. వాటి యాజమానులు.. వాటి బాధ్యతలను తమ వారసులకు, ప్రత్యేకించి కూతుళ్లకే ఎక్కువగా అప్పగిస్తున్నాయి. కూతుళ్లపై విశ్వాసం కనబరుస్తున్నారు వాణిజ్య వేత్తలు. తొలుత తల్లిదండ్రుల గైడెన్స్తో మొదలైనా.. క్రమంగా ప్రజలతో, విభిన్న కస్టమర్లతో మమేకమై.. వారి అభిరుచులకు అనుగుణంగా ఆయా సంస్థల ఉత్పత్తులను అభివృద్ధి చేస్తూ.. తండ్రులకు తగ్గ తనయలుగా రుజువు చేసుకుంటున్నారు.
ప్రపంచంలోకెల్లా అతిపెద్ద కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్.. ప్రపంచంలోకెల్లా రెండో లగ్జరీ గూడ్స్ బ్రాండ్ డియోర్ (రూ.72.4 వేల కోట్లు) బాధ్యతలను తన కూతురు డెల్ఫైన్కు అప్పగించ తలపెట్టారు. డెల్ఫైన్ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. లూయిస్ వౌట్టొన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పని చేస్తూనే తన కూతురు డెల్ఫైన్.. సేల్స్లో న్యూ రికార్డు నమోదు చేశారని తెలిపారు.
నోయల్ టాటా తనయ లియాహ్.. 2002 నుంచి టాటా సన్స్ అనుబంధ సంస్థ తాజ్ గ్రూప్ హోటల్స్ మేనేజింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత 18 ఏండ్లలో దేశంలోని వ్యాపార కుటుంబాల బిజినెస్లను మహిళలే సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. వారిలో తండ్రి వారసత్వంగా 76 శాతం మంది, భర్త వారసత్వంగా వచ్చిన బిజినెస్ను 24 శాతం మంది మహిళలు నిర్వహిస్తున్నారు.
రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్లో ఈషా అంబానీ 2014లో చేరారు. ఆమె సారధ్యంలో జియో ఇప్పుడు దేశంలోనే 421.3 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లతో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్గానిలిచింది. ఇక రిలయన్స్ రిటైల్ ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైలర్ సంస్థగా అవతరించింది. పిరమల్ గ్రూప్కు చెందిన ఆనంద్ పిరమల్ను పెండ్లి చేసుకున్న ఈషా అంబానీ గత నవంబర్ 19న కవల పిల్లలకు జన్మనిచ్చారు.
నిషాబ గోద్రేజ్.. అది గ్రోదెజ్ రెండో కూతురు. 2017లో గోద్రేజ్ గ్రూపులో చేరినప్పటి నుంచి ఏటా గోద్రేజ్ కన్జూమర్ లిమిటెడ్ 18 శాతం నికర లాభాలు గడిస్తున్నది. 2015-16లో రూ.8,305 కోట్ల నికర లాభం గడిస్తే, 2021-22లో అది రూ.17,381 కోట్లకు దూసుకెళ్లింది. సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా అది గోద్రేజ్ నుంచి సంస్థ పగ్గాలు నిషాబ అందుకున్నారు. కల్పేష్ మెహతాను పెండ్లాడారు. నిషాబా గోద్రేజ్.
దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటి హెచ్సీఎల్ టెక్.. రెండేండ్లలో హెచ్సీఎల్ టెక్ నికర లాభం రూ.1000 కోట్లు పెరిగింది. 2020 జూలైలో తండ్రి శివ్ నాడార్ నుంచి సంస్థ చైర్పర్సన్గా రోష్నీ నాడార్ బాధ్యతలు చేపట్టారు. 2020 మార్చి నాటికి సంస్థ నికర లాభం రూ.8,969 కోట్లకు చేరుకుంది. తద్వారా రోష్నీ నాడార్ తండ్రికి తగ్గ తనయ అని రుజువు చేసుకున్నారు. కరోనా తర్వాత 2022 మార్చి నెలాఖరు నాటికి హెచ్సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం రూ.10,874 కోట్లకు దూసుకెళ్లింది. 2020లోనే ఫోర్బ్స్-100 శక్తిమంతమైన మహిళల జాబితాలో 55వ ర్యాంక్ పొందారు రోష్నీ నాడార్.
దేశంలోని ఫార్మా కంపెనీల్లో లుపిన్ది మూడో స్థానం. 1968లో దీన్ని స్థాపించిన దేశ్ బంధు గుప్తా.. ఈ కంపెనీ తండ్రి నుంచి ఆయన ముద్దుల కూతురు వినితా గుప్తా స్వీకరించారు. ఆమె సారధ్యంలో లుపిన్ పలు కంపెనీలను టేకోవర్ చేసింది. లుపిన్ టర్నోవర్లో కొత్త కంపెనీల వాటా సుమారు 40 శాతం ఉంటుంది.
ఇష్టం లేకున్నా తండ్రి వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలు కూడా ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీ బిస్లరీ యజమాని రమేశ్ చౌహాన్ తనయ జయంతి చౌహాన్.. గత 13 ఏండ్లుగా తండ్రి వ్యాపార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జయంతి చౌహాన్కు ఇష్టం లేకపోవడంతో రమేశ్ చౌహాన్ తన సంస్థను రూ.7000 కోట్లకు టాటా కన్జూమర్కు విక్రయించారు. ఇక బిర్లా గ్రూప్ అధినేత కుమార మంగళం బిర్లా తనయ అనన్య సొంతంగా `స్వతంత్ర` అనే మైక్రో ఫైనాన్స్ కంపెనీని ప్రారంభించారు.
పురుషులే కాదు.. మహిళలు తమకు వ్యాపార సామర్థ్యం ఉందని నిరూపించుకుంటున్నారు. మగవారితో సమానంగా వ్యాపార లావాదేవీల్లో దూసుకెళ్లడం ద్వారా ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న మహిళామణులు కూడా ఉన్నారు. 50 ఏండ్ల వయస్సు గల వారిలో ఆసియా-పసిఫిక్ రీజియన్ పరిధిలో టాప్-50 బిజినెస్ మహిళలను ఫోర్బ్స్ గుర్తించింది. అందులో ఆరుగురు ఇండియన్స్ ఉన్నారు. వారెవరో చూద్దాం..
సంఘమిత్రా బంధోపాధ్యాయ్.. వృత్తి రీత్యా కంప్యూటర్ శాస్త్రవేత్త. 2015లో తొలిసారి ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ మహిళా డైరెక్టర్గా నియమితులయ్యారు.
మధాబి పూరి బుచ్.. దేశీయ స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తొలి మహిళా చైర్పర్సన్గా గతేడాది మార్చిలో ఎంపికయ్యారు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వేదికలపై ఇన్సైడ్ ట్రేడింగ్ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఆమెకు కేంద్ర ప్రభుత్వం కోరింది.
జరీన్ దారువాలా.. నష్టాల్లో ఉన్న స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఇండియా సీఈవోగా 2016లో నియమితులయ్యారు. 2019 నాటికి బ్యాంకును నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చారు. ఈ జాబితాలో ఫ్యాషన్ హౌస్ ఫౌండర్ అనితా డోగ్రే, సెయిల్ చైర్పర్సన్ సోమా మండల్, 2022 బూకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ కూడా ఫోర్బ్స్ జాబితాలో చేరారు.