PNB Alert | తమ ఖాతాదారులకు చెక్ మోసాల నుంచి భద్రత కల్పించడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) కీలక నిర్ణయం తీసుకున్నది. భారీ మొత్తంలో జరిగే లావాదేవీలకు వచ్చేనెల నాలుగో తేదీ నుంచి పాజిటివ్ పే సిస్టమ్ (పీపీఎస్) తప్పనిసరిగా అమలు చేస్తామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. రూ. 10 లక్షల కంటే ఎక్కువ విలువ గల చెక్ల లావాదేవీలకు పీపీఎస్ విధానం తప్పనిసరి అమలులోకి వస్తుందని పీఎన్బీ పేర్కొంది.
ఇంతకుముందే ఆర్బీఐ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా గతేడాది జనవరి నుంచి సీటీఎస్ క్లియరెన్స్ వేళ రూ.50 వేల కంటే ఎక్కువ విలువ గల చెక్ల లావాదేవీలకు పీపీఎస్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. పీపీఎస్ వ్యవస్థను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) అభివృద్ధి చేసింది.
పీపీఎస్ వ్యవస్థ ప్రకారం భారీ మొత్తం విలువ గల చెక్.. క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు కొన్ని వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్బీ ఖాతాదారులు తమ ఖాతా, చెక్ నంబర్, చెక్ ఆల్ఫా కోడ్, ఆ చెక్ జారీ చేసిన తేదీ, లబ్ధి దారుడి పేరు తెలియ చేయాలి. చెక్ క్లియర్ చేయడానికి కనీసం 24 గంటల ముందు ఖాతాదారులు తాము జారీ చేసిన చెక్ వివరాలు పంచుకోవాలి. ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్, ఎస్సెమ్మెస్ బ్యాంకింగ్ ద్వారా గానీ, తమ సొంత బ్యాంకు శాఖకు గానీ వెళ్లి ఖాతాదారులు తాము చెక్ జారీ చేసిన వివరాలు తెలియజేయాలి.