న్యూఢిల్లీ, జూలై 28: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 70 శాతం తగ్గి రూ.308.44 కోట్లకు పరిమితమైంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.1,023.46 కోట్ల లాభాన్ని గడించింది. బ్యాంక్ ఆదాయం రూ.22,515 కోట్ల నుంచి రూ.21,294 కోట్లకు పరిమితమైంది. వడ్డీల మీద వచ్చే ఆదాయం రూ.18,921 కోట్ల నుంచి రూ.18,757 కోట్లకు తగ్గడం వల్లనే లాభాల్లో భారీ గండిపడిందని పేర్కొంది.