PNB Charges | దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). సంక్రాంతి పర్వదినం సందర్భంగా తన ఖాతాదారులకు షాక్ ఇవ్వబోతున్నది. ఈ నెల 15 తర్వాత సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ రూ.10వేల కన్నా తక్కువ ఉంటే చార్జీల మోత మోగనున్నది. అలాగే అన్ని రకాల సేవలకూ చార్జీలు వసూలు చేయనున్నది. పట్టణ ప్రాంత ప్రజలు ఇక నుంచి పీఎన్బీ శాఖల్లో సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉంటే రూ.10 వేల కనీస మొత్తం నిల్వలు ఉంచాలని బ్యాంక్ వెబ్సైట్ తెలిపింది. ఇప్పటి వరకు కనీస మొత్తం నిల్వలు రూ.5000 ఉండేది.
తాజాగా సవరించిన నిబంధన మేరకు పట్టణ ప్రాంతాల పీఎన్బీశాఖల్లో సగటు బ్యాలెన్స్ను గణిస్తారు. ప్రతి మూడు నెలలకోసారి తనిఖీ చేసినప్పుడు రూ.10వేల బ్యాలెన్స్ లేకపోతే రూ.600 చార్జీ వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇది రూ.300 మాత్రమే ఉండేది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని సేవింగ్స్ ఖాతాల్లో కనీస మొత్తాలు నిల్వ లేకుంటే రూ.400 చార్జీ వసూలు చేస్తుంది.
పీఎన్బీ వెబ్సైట్ కథనం ప్రకారం వివిధ లాకర్ల చార్జీలు కూడా మారనున్నాయి. అర్బన్, మెట్రోపాలిటన్ సిటీస్లో లాకర్ల చార్జీలు రూ.500లకు పెంచేసింది. గ్రామీణ ప్రాంత శాఖల్లో స్మాల్ సైజ్ లాకర్లకు గతంలో రూ.1000 వసూలు చేస్తే ఇప్పుడు రూ.1,250 విధించనున్నది. పట్టణ ప్రాంతాల్లో దీన్ని రూ.1,500 నుంచి రూ.200లకు పెంచనుంది.
మీడియం సైజ్ లాకర్ల చార్జీలు రూ.2,00 నుంచి రూ.2500 (గ్రామీణ ప్రాంతాలకు), రూ.3000 నుంచి రూ.3,500 (పట్టణ ప్రాంతాల్లో) లకు పెంచేసింది. గ్రామీణ శాఖల్లో పెద్ద లాకర్లకు రూ.2,500 నుంచి రూ.3000లకు, పట్టణ ప్రాంతాల్లో రూ.5,000 నుంచి రూ.5,500లకు సవరించింది. చాలా పెద్ద సైజ్ లాకర్కు రూ.10 వేల చార్జీ విధిస్తుంది.
ఏడాదిలో లాకర్ను 12 సార్లు విజిట్ చేయొచ్చు. ఒక్కో విజిట్కు రూ.100 చార్జీ వసూలు చేస్తుంది. ఇంతకుముందు 15 సార్లు సందర్శించే అవకాశం ఉంది. ఇక కరంట్ ఖాతాను 14 రోజుల నుంచి ఏడాది లోపు క్లోజ్ చేసినా రూ.600 నుంచి రూ.800 రుసుము పెంచేసింది.
ఇక ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి రుణ వాయిదా చెల్లింపు లేదా.. పెట్టుబడి చెల్లింపులో ఒక్కసారి డెబిట్ ఫెయిలైనా రూ.250 వసూలు చేస్తారు. ఇంతకుముందు రూ.100 ఉండేది. డిమాండ్ డ్రాఫ్ట్ క్యాన్సిల్ చేసుకుంటే రూ.100 నుంచి రూ.150కి పెంచేశారు. చెక్ రిటన్ అయినా చార్జీలు పెంచేశారు. రూ.లక్ష విలువ గల చెక్ రిటన్ అయితే రూ.100 నుంచి రూ.150, రూ.లక్ష పై చిలుకు చెక్ రిటన్ అయితే రూ.200కి బదులు రూ.250 వసూలు చేస్తారు. మూడు సార్లకు మించి నగదు డిపాజిట్ చేస్తే.. ప్రతి లావాదేవీపై రూ.50 చార్జీ వసూలు చేస్తారు. ఇంతకుముందు ఐదు సార్ల వరకు డిపాజిట్లు ఉచితంగా ఉండేది. ఐదు సార్లకు మించితే రూ.25 వసూలు చేసేవారు.