కరోనా బారిన పడిన వారికి ఏదోరకంగా సైబరాబాద్ పోలీస్ అండగా ఉంటోంది. తాజాగా కరోనా సోకిన భార్యాభర్తలు ఆస్ప త్రి లేదా ఐసోలేషన్లో ఉంటే వారి పిల్లలు సంరక్షణకు ముందుకొచ్చింది. సైబరాబాద్ పోలీసు, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్తగా ఏర్పాటు చేసిన చైల్డ్కేర్ రెస్పాన్స్ కేంద్రాన్ని రెండు స్వచ్ఛంద సంస్థలతో కలిసి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ బుధవారం ప్రారంభించారు. ఒంటరి కుటుంబాలకు చెందిన దంపతులు కరోనా బారిన పడి ఐసోలేషన్లో ఉంటే వారు తమ పిల్లల సంరక్షణ కోసం 08045811215 నంబర్ను సంప్రదిస్తే షీటీమ్స్ తగిన చర్యలు తీసుకొని పిల్లలను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటుందన్నారు. ఈ విధంగా పిల్లలను చూసుకునేందుకు ఎవరు ముందుకొచ్చినా వారి ద్వారా కేంద్రాలను నిర్వహించేందుకు సైబరాబాద్ పోలీసులు సిద్ధం గా ఉన్నారని, వీటి నిర్వహణ బాధ్యతను సైబరాబాద్ షీ టీమ్స్ పర్యవేక్షిస్తుందని సీపీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన ఎస్సీఎస్సీ ఉమెన్ ఫోరం సంయుక్త కార్యదర్శి ప్రత్యూష, నేహరీచా అరియా, సుమారావు, మృదులా, వాణీ, లావన్య, చందన, వై.పల్లవ, దీప్, షీ టీమ్స్ డీసీపీ అనసూయలను సీపీ అభినందించారు. కార్యక్రమంలో ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల పాల్గొన్నారు.