ప్రస్తుత వర్చువల్ ప్రపంచంలో.. డిజిటలైజేషన్దే పెత్తనం. అందుకే ఇప్పుడు సంప్రదాయ కరెన్సీపై డిజిటల్ కరెన్సీ ఆధిపత్యం నడుస్తున్నది. ఈ క్రమంలోనే క్రిప్టో కరెన్సీ డిమాండ్ అంతటా వ్యాపించింది.భౌతికంగా కనిపించని ఈ ఊహాజనిత కరెన్సీల్లోకి గత రెండు, మూడేండ్లుగా కుప్పలుతెప్పలుగా పెట్టుబడులు వచ్చిపడుతున్నాయి. ఇదే ఇప్పుడు భారత్సహా పలు ప్రధాన దేశాల్లో ఆందోళన కలిగిస్తున్నది. పైపై మెరుగులు చూసి పెట్టుబడులకు దిగుతున్న అమాయక మదుపరులపట్ల రిజర్వ్ బ్యాంక్ సైతం ఒకింత కలవరపడుతుండగా, వీటి నియంత్రణ కోసం స్పష్టమైన చట్టాలు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
క్రిప్టో కరెన్సీలలో మదుపు గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ. క్రిప్టో కరెన్సీ, అధికారిక డిజిటల్ కరెన్సీ నియంత్రణ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదముద్ర వేయించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుండటంతో దానిపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఓవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వంటివారు క్రిప్టోలపై ఆందోళన వ్యక్తం చేస్తుండటం, మరోవైపు ఆర్బీఐ నేతృత్వంలోనే ఓ డిజిటల్ కరెన్సీని తేవాలని మోదీ సర్కారు యోచిస్తుండటం.. ఇప్పుడు ఈ వర్చువల్ కరెన్సీల్లో మదుపు ఎంతవరకు శ్రేయస్కరం అన్న సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు ప్రభుత్వం క్రిప్టో కరెన్సీలను నిషేధిస్తుందా?.. నిషేధిస్తే ఇప్పటికే మదుపు చేసినవారి పరిస్థితి ఏమిటి?
ప్రభుత్వం నిషేధిస్తే..?
క్రిప్టో కరెన్సీలను నిషేధించాలని నిర్ణయిస్తే.. క్రిప్టో ఎక్సేంజీలకు, మీ బ్యాంక్ అకౌంట్లకు మధ్య లావాదేవీలను మొదట స్తంభింపజేస్తుంది. మీ క్రిప్టో కరెన్సీలను మన కరెన్సీలలోకి మార్చుకునే వీలుండదు. అలాగే మన కరెన్సీని మార్చుకుని క్రిప్టో కరెన్సీ కొనుగోలు చేసేందుకు అవకాశమూ ఉండదు. ప్రస్తుతం క్రిప్టో కరెన్సీలకు సంబంధించి భారత్లో ఎలాంటి చట్టమూ లేదు. అలాగని ఇప్పటివరకు వాటి లావాదేవీలను నిషేధించేందుకు కూడా ఎటువంటి చట్టమూ లేదు. అందుకే క్రిప్టో ట్రేడింగ్, క్రిప్టో ఎక్సేంజీలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అయితే ఇవి మరింత తికమకలకు గురిచేస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిషేధించనున్నట్టు వార్తలు వస్తున్నా సరే.. దేశంలో క్రిప్టో కరెన్సీలలో మదుపు 200 మిలియన్ డాలర్ల నుంచి 40 బిలియన్ డా లర్లకు పెరగడం గమనార్హం. ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బిల్లులో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ పూర్తి నిషేధంపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రభుత్వం తన సొంత క్రిప్టో లేదా డిజిటల్ కరెన్సీని ప్రవేశ పెడుతుందా?.. లేదా?.. అన్నదీ తెలియదు. ప్రభుత్వ వర్గాల ప్రకారం పూర్తిస్థాయి నిషేధం ఉండకపోవచ్చు. బిల్లు, నిషేధంపై స్పష్టత వచ్చేదాకా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలు అన్నదానికి నిర్వచనాన్ని ఇవ్వడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నట్లే.
ఎందుకీ బూమ్?
నిషేధం వార్తలు వస్తున్నా.. క్రిప్టో కరెన్సీలలో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. వజీరిక్స్ లాంటి స్టార్టప్ ఎక్సేంజీలు కొత్త కాన్సెప్ట్లతో ఇన్వెస్టర్లను, ట్రేడర్లను ఆకరిస్తూనే ఉన్నాయి. అయితే మిగతా అసెట్లలో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ల రాబడి తగ్గిపోవడంతోపాటు పన్నుల భారం చాలా ఎక్కువ. కానీ క్రిపో ్టకరెన్సీ ట్రేడింగ్ ఇంకా నియంత్రణలోకి రాకపోవడంతో లావాదేవీ చార్జీలు దాదాపు శూన్యం. దీంతో రిస్క్ తీసుకోగలిగినవారంతా క్రిప్టో కరెన్సీల్లో ట్రేడింగ్ చేయడానికే మొగ్గుచూపుతున్నారు. పైగా 24 గంటలూ ట్రేడింగ్ జరిపే వీలుండటం, అధిక రాబడిని ఇస్తుండటం కూడా మరో ఆకర్షణగా నిలుస్తున్నది. ఫలితంగానే క్రిప్టో బూమ్ నడుస్తున్నది.
ఎంత రిస్క్?
నియంత్రణ పరిధిలో లేని ఏ లావాదేవీల్లోనైనా రిస్క్ అన్నది సహజంగానే ఎక్కువ. మోసపోయినట్టు లేదా నష్టపోయినట్టు ఫిర్యాదు చేసేందుకు ఎలాంటి సాధికారిక సంస్థ ఉండదు. అలాగే క్రిప్టో ఎక్సేంజీల్లో జరిగే లావాదేవీల డాటాకు విశ్వసనీయత తక్కువ. అనేక సందర్భాలలో క్రిప్టో ఎక్సేంజీలలో ట్రేడింగ్లు చేయలేని పరిస్థితిని చూశాం. చెల్లింపులు జరగని సందర్భాలూ ఉన్నాయి. క్రిప్టో ట్రేడింగ్ లాభాలు సాధిస్తే అది స్పెక్యులేటివ్ బిజినెస్ ఆదాయంగానే ఇన్కమ్ టాక్స్ (ఐటీ శాఖ) అధికారులు పరిగణిస్తున్నారు. దీంతో క్రిప్టో మదుపరులు దాదాపు 30 శాతం వరకు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటికి మించి రిస్క్ను అర్థం చేసుకోకపోతే చివరగా మిగిలేది శూన్యమే.
భద్రం.. బీ కేర్ఫుల్ బ్రదర్!
పంచ సూత్రాలతో ఆర్థిక మోసాలకు చెక్
కంటికి కనిపించని సైబర్ నేరగాళ్లు మన బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బును క్షణాల్లో ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉంటున్నారు. లాటరీ వచ్చిందని, తక్కువ ధరకే వస్తువులు విక్రయిస్తున్నాం..మంచి ధరకు కొనుగోలు చేస్తాం..అంటూ నమ్మబలుకుతున్న ఈ కేటుగాళ్లు మన డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇలాంటి ఆర్థిక సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు ఈ ఐదు సూత్రాలను సూచిస్తున్నారు సైబర్ క్రైం నిపుణులు..