న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాముతో పోల్చారని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. ఆర్బీఐ దగ్గరున్న అపారమైన మిగులు నగదు నిల్వలను కేంద్ర ప్రభుత్వ ఖజానాకు మోదీ సర్కారు అప్పట్లో తరలించాలనుకున్న విషయం తెలిసిందే. దీన్ని ఆర్బీఐ గవర్నర్గా పటేల్ గట్టిగా అడ్డుకున్న సంగతీ విదితమే. దీంతో ఆర్బీఐకి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు పెద్ద ఎత్తున విభేదాలు కూడా చోటు చేసుకున్నాయి.
ఈ క్రమంలోనే ప్రధాని మోదీ.. ఒకసారి విపరీతమైన ఆగ్రహావేశంతో ఊగిపోయారని, మోదీని అంత కోపంగా తాను చూడటం అదేనని గార్గ్ చెప్పారు. అప్పుడే ‘నగదు నిల్వలపై కూర్చున్న నాగుపాము’ అని ఉర్జిత్ పటేల్ను మోదీ అభివర్ణించారన్నారు. ‘వుయ్ ఆల్సో మేక్ పాలసీ: యాన్ ఇన్సైడర్స్ అకౌంట్ ఆఫ్ హౌ ది ఫైనాన్స్ మినిస్ట్రీ ఫంక్షన్స్’ పేరుతో రాసిన తన పుస్తకంలో ఉర్జిత్ పటేల్ గురించి గార్గ్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఉర్జిత్ పటేల్ గవర్నర్గా ఉన్నప్పుడు చాలా అంశాలపై ఆర్బీఐ.. కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖల నిర్ణయాలతో విభేదించినట్టు గార్గ్ చెప్పారు. అప్పట్లో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా గార్గ్ పనిచేసినది తెలిసిందే. కాగా, ఎలక్టోరల్ బాండ్లు, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాల్లో కేంద్రంతో రిజర్వ్ బ్యాంక్ విభేదించిందని వివరించారు. కాగా, మోదీ సర్కారుతో ఉన్న విభేదాల నడుమ పటేల్ తన గవర్నర్ పదవికి కూడా అర్ధాంతరంగానే రాజీనామా చేసి వెళ్లిపోయినది విదితమే.