Income Tax Planing | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) ముగింపు దశకు చేరుకుంటున్నది. ప్రతి వేతన జీవి, వ్యాపారి కూడా ఈ ఏడాది కాలంలో సంపాదించిన ఆదాయానికి అనుగుణంగా ఐటీ రిటర్న్స్ సమర్పిస్తే సరిపోతుందా.. ఏ శ్లాబ్ కింద పన్ను చెల్లించాలన్న విషయమై ఒక క్లారిటీకి రావచ్చు. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి రెండు ఆదాయం పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. పాత ఆదాయం పన్ను విధానంలో కొన్ని రకాల పెట్టుబడులతో పన్ను ఆదా చేయొచ్చు. కొత్త ఆదాయం పన్ను పాలసీ కింద అతి కొద్ది మినహాయింపులు తప్పా.. ఎక్కువ రాయితీలకు చాన్స్ లేదు.
అయితే, చాలా మంది చివరి క్షణం వరకు వేచి ఉండరు. కొంత మంది మాత్రం ఆఖరి నిమిషం వరకు ఏయే పెట్టుబడి స్కీమ్ల్లో పెట్టుబడులు పెట్టాలన్న విషయమై క్లారిటీతో ఉండరు. కానీ, సరైన ప్లానింగ్ లేకపోతే పన్ను రాయితీలు పొందాలంటే పెద్ద మొత్తంలో ఒకేసారి మదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. చివరి క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయా పెట్టుబడి పథకాల ఎంపికలో కొన్ని పొరపాట్లు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కనుక పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టే పథకాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరి.. అయితే జాగ్రత్తలు ఎలా ఉంటాయో చూద్దామా..
ముందుగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించాలో చెక్ చేసుకోవాలి. మొత్తం ఇన్కం, ఆ ఆదాయానికి వర్తించే పన్ను శ్లాబ్ గురించి క్లారిటీ తెచ్చుకోవాలి. పనిచేసే సంస్థలో వేతనమైనా, వ్యాపారంలో వచ్చే ఆదాయం, డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్తో వచ్చే స్వల్ప, దీర్ఘకాలిక లాభాలు, రిటర్న్స్, బహుమతులు.. అన్ని రకాల ఆదాయాలను కలిపి గణించాలి. ఇక ఆదాయం పన్ను విభాగం వద్ద మీ ఆదాయం, అదిక విలువ గల లావాదేవీలు ఉంటాయి. కనుక ముందే మీరు పని చేసే సంస్థలోని అకౌంట్స్ విభాగాన్ని సంప్రదిస్తే మీరు ఎంత పన్ను చెల్లించాలో పూర్తిగా క్లారిటీ లభిస్తుంది. పన్ను ఆదా చేయడానికి గల అవకాశాలు చెక్ చేసుకోండి. ఇప్పటికే టీడీఎస్ రూపంలో చెల్లించి ఉంటే, మార్చిలో ఎంత పన్ను పే చేయాలో తెలుసుకుంటే, ఏయే పథకాల్లో నిధులు పొదుపు చేయొచ్చో తెలిసిపోతుంది.
ఇంటి రుణంపై చెల్లించే వడ్డీ, ఈపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియంలు, పిల్లల విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజు తదితర అంశాలు గణించిన తర్వాత ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద ఎంత పొదుపు చేయాలో తెలుసుకోవాలి. ఆదాయం పన్నుపై రాయితీలు పొందడానికి పలు మార్గాలు ఉన్నాయి. సంబంధిత వ్యక్తులు తమ అవసరాలను బట్టి ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు. కనుక అవసరం లేకున్నా అధిక ప్రీమియం గల ఇన్సూరెన్స్ పాలసీలు కొనుగోలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు.
పన్ను ఆదా మార్గాల్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒక ఆప్షన్ మాత్రమే. కేవలం బీమా ప్రీమియం చెల్లింపులతోనే ఎక్కువ పన్ను ఆదా చేయాలని భావిస్తే.. ఇతర ఫైనాన్సియల్ ప్లాన్లు దెబ్బ తింటాయి. ఖరీదైన పాలసీలకు బదులు తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్ పాలసీలను ఎంచుకోవడం బెటర్. ఎక్కువ ప్రీమియం గల పాలసీలు కొనుగోలు చేసి, తర్వాత సంవత్సరంలో ప్రీమియం చెల్లించలేక చతికిల పడటం ఆచరణీయం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పన్ను ఆదా పథకాలకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటది. ఉదాహరణకు మ్యూచువల్ ఫండ్స్ అందించే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్)లో ఒకసారి మదుపు చేస్తే, కనీస పక్షం మూడేండ్లు కొనసాగించాలి. ఇక బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకున్నా.. ఐదేండ్ల మెచ్యూరిటీ పీరియడ్ వరకు అలాగే ఉంచాలి. ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా నిర్ణీత గడువు ఉంటది. గడువుపై అవగాహన లేకుండా పన్ను పొదుపు పథకాలను ఎంపిక చేసుకుంటే, తర్వాత వెనక్కి తీసుకోవాలనుకున్నా సాధ్య పడదు.
పన్ను పొదుపు స్కీమ్ల్లో ఆదాయం ఎంత అన్నది కూడా ముఖ్యమే. సేఫ్టీ పథకాల్లో పొదుపు చేస్తే రిటర్న్స్కు హామీ ఉంటది. మార్కెట్ బేస్డ్ పథకాల్లో పెట్టుబడులపై రిటర్న్స్కు సరైన అంచనాలు ఉండవు. కొన్ని రకాల ఈఎల్ఎస్ఎస్ స్కీమ్ల్లో 10-15 శాతం వరకు రిటర్న్స్ పొందొచ్చు. ఆయా పథకాలపై వచ్చే రిటర్న్స్, వడ్డీ ఆదాయం కలిపి చూపి.. మన ఆదాయానికి వర్తించే పన్ను శ్లాబ్ ప్రకారం టాక్స్ పే చేయాలి. కనుక పన్ను పొదుపు పథకాలను సెలెక్ట్ చేసుకునే సమయంలో ఈ విషయం పరిగణనలోకి తీసుకోవాలి.
సురక్షిత పొదుపు పథకాల్లో మదుపు చేయడం వల్ల పన్ను ఆదా అవుతుంది కానీ ఎక్కువ రిటర్న్స్ పొందలేం. ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక లక్ష్యాలకు లోబడి పెట్టుబడులు ఉండేలా చూసుకోవడం బెటర్ అని నిపుణులు చెబుతున్నారు. ఆయా పథకాల ఎంపిక మంచి పొదుపు-పెట్టుబడి పథకాల మేలు కలయికగా ఉంటేనే ఆశించిన ఫలితాలు వస్తాయని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. కనుక ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుని.. క్లారిటీ వచ్చాకే పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడులపై నిర్ణయానికి రావాలని అంటున్నారు.