PhonePe for IPO | గ్లోబల్ రిటైల్ నెట్వర్క్ కంపెనీ వాల్మార్ట్ గ్రూప్ అనుబంధ యూపీఐ పేమెంట్స్ సంస్థ ఫోన్పే ( PhonePe ) ఐపీవో ద్వారా నిధుల సేకరణకు ప్రయత్నాలు ప్రారంభించింది. రూ.62, 000-78,000 కోట్లు (8-10 బిలియన్ల డాలర్లు) నిధులు సేకరించాలని ఫోన్పే భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం బ్యాంకర్లు, న్యాయసలహా సంస్థలను ఎంపిక చేయనున్నట్లు సమాచారం.
ఇలా ఐపీవో ద్వారా సేకరించిన నిధులతో యూపీఐ పేమెంట్స్తోపాటు ఫైనాన్సియల్ సర్వీసెస్ పోర్ట్ఫోలియో విస్తరణకు ఫోన్పే ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం సింగపూర్ కేంద్రంగా రిజిస్టరై ఉన్న ఫోన్పే సంస్థను మేడ్ ఇన్ ఇండియా సంస్థగా రూపుదిద్దే దిశగా యోచిస్తున్నట్లు ఆ సంస్థ వర్గాల కథనం. ఇప్పటికే ఈ నిర్ణయానికి ఫోన్పే బోర్డు అనుమతించిందని తెలిసింది.
ఫోన్పేను ఫ్లిప్కార్ట్ మాజీ ఎగ్జిక్యూటివ్లు సమీర్ నిగమ్, రాహుల్ చారి, బర్జిన్ ఇంజినీర్ స్థాపించారు. దాన్ని 2016లో ఫ్లిప్కార్ట్ కొనుగోలు చేసింది. 2018లో ఫోన్పేతోపాటు ఫ్లిప్కార్టును వాల్మార్ట్ టేకోవర్ చేసింది. ప్రస్తుతం సంస్థ లాభాల్లోకి వచ్చాక ఇన్షియల్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు వెళ్లాలని ఫోన్పే మేనేజ్మెంట్ చూస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది కల్లా లాభాల దిశగా అడుగులేస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే యూపీఐ చెల్లింపుల జోరు పెరిగింది. వచ్చే డిసెంబర్ నాటికి 2600 మంది నుంచి 5400 మందికి వరకు సిబ్బందిని యోచిస్తున్నట్లు వినికిడి. అయితే, ఇప్పటికిప్పుడు తాము ఐపీవోకు వెళ్లే యోచన, ప్రణాళిక లేదని ఫోన్పే వర్గాలు చెప్పినట్లు సమాచారం.