ముంబై, ఆగస్టు 26: దేశీయ ఫార్మా రంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ప్రతియేటా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగం వచ్చే రెండేండ్లలో 60 బిలియన్ డాలర్లు(రూ.4 లక్షల కోట్లు దాటే అవకాశం) ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా 45 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. అంతర్జాతీయ దేశాల ఫార్మా రంగం పరిమాణంలో చూస్తే మూడో స్థానంలో ఉన్న భారత్..విలువ పరంగా 13వ స్థానంలో ఉన్నది. జనరిక్ ఔషధాలకు ఉన్న డిమాండే ఇందుకు కారణమని నివేదిక విశ్లేషించింది. గడిచిన ఐదేండ్లలో దేశీయ ఫార్మా రంగం నికరంగా 7 శాతానికి పైగా వృద్ధిని సాధిస్తున్నది.
కరోనాతో ఔషధాలకు డిమాండ్
ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ కారణంగా ఔషధాలకు ఎనలేని డిమాండ్ నెలకొన్నది. దీంతో 2020-21లో ఈ రంగం రెండంకెల వృద్ధి 12 శాతం సాధించింది. ఫార్మా రంగ ప్రతినిధులు మాత్రం వచ్చే రెండేండ్లలో 11 శాతం వృద్ధిని సాధించే అవకాశాలున్నాయని అంచనావేస్తున్నారు. దీంతో ఈ రంగం 60 బిలియన్ డాలర్ల మార్క్ను సాధించేందుకు వీలుంటుందన్నారు. మరోవైపు పలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నది దేశీయ ఫార్మా రంగం. ముఖ్యంగా చైనా ముడి సరుకులపై ఆధారపడటం, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు పెరుగడం, పరిశ్రమ ఆర్థిక మూలాలు ద్రృడంగా ఉండటంకొన్ని ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఔషధ పరిశ్రమ ఐదు శాతం నికర వృద్ధితో 21 బిలియన్ డాలర్లకు చేరుకున్నది. అలాగే 17 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫార్మా ఎగుమతులు 24 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి.