న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను (ఓఎంసీ) పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి కోరారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గడంతో పాటు ఓఎంసీల రికవరీ మెరుగుపడితే ప్రజలపై ఇంధన భారాలను తగ్గించాలని ఆయన సూచించారు. గంగా నదిలో సీఎన్జీ బోట్ రేస్ను ప్రారంభిస్తూ మంత్రి పెట్రో ధరల తగ్గింపును ప్రస్తావించారు.
కాగా పెట్రోల్, డీజిల్ ధరలను వాటి ధర కంటే తక్కువకు విక్రయించడం ద్వారా రూ . 21,200 కోట్ల నష్టాలు వాటిల్లినట్టు ఓఎంసీలు చెబుతున్నాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 139 డాలర్ల నుంచి 88 డాలర్లకు తగ్గినా, రష్యా నుంచి చమురు సరఫరాలు పెరగినా ఓఎంసీలు నష్టాల గురించే వల్లెవేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒడిదుడుకులతో సాగినా పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్లు తగ్గించడం ద్వారా ఇంధన ధరలు పెరగకుండా నియంత్రించగలిగామని పెట్రోలియం మంత్రి చెబుతున్నారు.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు గణనీయంగా దిగివచ్చినా చమురు దిగుమతుల బిల్లు అధికంగా ఉంటోందని, నష్టాలు తప్పడం లేదనే సాకుతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల తగ్గింపుపై ఓఎంసీలు చొరవ చూపకపోవడం వాహనదారుల జేబులకు గండి కొడుతున్నది. రాబోయే రోజుల్లో ఓఎంసీల ఆర్ధిక ఫలితాలు వెల్లడిస్తే గానీ అసలు పెట్రోల్, డీజిల్పై వాటికి ఎంత మేర నికర లాభం, నష్టం వాటిల్లుతున్నదన్న వివరాలు వెలుగుచూస్తాయి.