Personal Loan | ఎమర్జెన్సీగా డబ్బు అవసరం అయినప్పుడు పర్సనల్ లోన్ ఎంతో ఉపకరిస్తుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న పలు రకాల రుణాల్లో పర్సనల్ లోన్ మాత్రమే తొందరగా మంజూరవుతుంది. ఈ రుణం పొందడానికి ఎటువంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం ఉండక పోవడమే దీనికి కారణం. వెహికల్, హోం లోన్ మాదిరిగా మొత్తం లోన్ వినియోగంపై ఎటువంటి లిమిట్ ఉండదు. కనుక చాలా మంది పర్సనల్ లోన్ పొందడానికే ఆసక్తి చూపుతారు. అయితే, పర్సనల్ లోన్లు మంజూరు చేసే బ్యాంకులు కొన్ని రకాల చార్జీలు వసూలు చేస్తాయి. పర్సనల్ లోన్లపై బ్యాంకులు వసూలు చేసే చార్జీల గురించి తెలుసుకుందామా..
ప్రతి బ్యాంకు కూడా రుణ గ్రహీత నుంచి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు రూపంలో లోన్ మంజూరు చేయడానికయ్యే ఖర్చు వసూలు చేస్తాయి. కనుక పర్సనల్ లోన్ తీసుకునే వారంతా ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాల్సిందే. అయితే ప్రతి బ్యాంకులోనూ పర్సనల్ లోన్ మంజూరు చేయడానికి ప్రాసెసింగ్ ఫీజులో గరిష్ట, కనిష్ట చార్జీలు ఉంటాయి. మామూలుగానైతే యావరేజీన పర్సనల్ లోన్లపై ప్రాసెసింగ్ పీజు 0.25-3 శాతం ఉంటుంది.
పర్సనల్ లోన్ మంజూరు చేయడానికి ముందు లోన్ రీపేమెంట్ విషయమై రుణ గ్రహీత శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటాయి. బ్యాంకు అధికారి గానీ, థర్డ్ పార్టీ వ్యక్తి గానీ మీ వివరాలు సేకరిస్తారు. సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ తదితర అంశాలు పరిశీలిస్తారు. ఇందుకోసం బ్యాంకులు కొంత ఖర్చు చేస్తాయి. ఇలా చేసిన ఖర్చులను వెరిఫికేషన్ చార్జీల పేరుతో లోన్ తీసుకునే వ్యక్తుల నుంచి వసూలు చేస్తాయి బ్యాంకులు.
పర్సనల్ లోన్ తీసుకున్న వారు ప్రతి నెలా ఈఎంఐ పేమెంట్ కోసం ఎల్లవేళలా కొంత సొమ్ము దాచి పెట్టాలి. ఆ గడువు సమయానికి బ్యాంకు ఖాతాలో మనీ నిల్వ ఉంచాలి. ఏ కారణం చేతనైనా ఒక ఈఎంఐ పే చేయకున్నా.. తదుపరి నెలలో కొంత ఫీజు రుణ గ్రహీతల నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. ఈఎంఐ ఎగవేత లేదా చెక్ బౌన్స్ అయితే బ్యాంకులు రూ.500, అంతకంటే ఎక్కువ చార్జీ వసూలు చేస్తాయి.
వివిధ రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయమే బ్యాంకులకు ప్రధాన ఆదాయ వనరు. ఎందుకైనా రుణ గ్రహీతలు ముందస్తుగా పర్సనల్ లోన్ మొత్తం పే చేయడానికి ముందుకు వస్తే.. ఆ రుణంపై వచ్చే వడ్డీ ఆదాయం బ్యాంకులు కోల్పోతాయి. అందుకే ముందస్తు రుణ చెల్లింపులపై 2-4 శాతం పెనాల్టీ వసూలు చేస్తాయి. ప్రీ-పేమెంట్, ఫోర్ క్లోజర్ పెనాల్టీ పేరుతో ఈ చార్జీలు వసూలు చేస్తాయి.