న్యూయార్క్, ఆగస్టు 3: ప్రముఖ జ్యూస్ బ్రాండ్ ట్రాపికానాను పెప్సీకో అమ్మేస్తున్నది. మరికొన్ని జ్యూస్ బ్రాండ్లనూ విక్రయించనున్నది. ఈ మేరకు ఓ ప్రైవేట్ ఈక్విటీ సంస్థతో రూ.24,500 కోట్లకు పెప్సీ డీల్ కుదుర్చుకున్నది. ఈ ఏడాది ఆఖరుకల్లా లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలోనో ఈ లావాదేవీ ముగియవచ్చని అంచనా. కాగా, పీఏఐ పార్ట్నర్స్తో చేసుకున్న ఈ డీల్లో భాగంగా కొత్తగా ఏర్పాటయ్యే జాయింట్ వెంచర్లో పెప్సీకి 39 శాతం నాన్-కంట్రోలింగ్ వాటా ఉండనున్నది. నిజానికి 20 ఏండ్ల కిందట్నుంచే జ్యూస్ల వ్యాపారం క్షీణిస్తూ వస్తున్నది.ఒక్క అమెరికా విషయానికే వస్తే.. 2003లో 4.2 బిలియన్ గ్యాలన్లుగా ఉన్న జ్యూస్ వినియోగం.. 2017లో 3 బిలియన్ గ్యాలన్లకు పడిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతున్నది. ఈ క్రమంలో మున్ముందు మరింతగా పడిపోవచ్చన్న అంచనాల మధ్య పెప్సీకో ఈ నిర్ణయానికి వచ్చింది.