హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్ర్టానికి చెందిన ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ పెన్నార్ ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున 2028 నాటికి రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు పెన్నార్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్యా రావు తెలిపారు. భవిష్యత్తు ప్రణాళికపై ఆయన మాట్లాడుతూ..అత్యధిక లాభాలను ఆర్జించని విభాగాల వ్యాపారాన్ని క్రమంగా తగ్గించుకుంటూ..అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న రంగాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు చెప్పారు.
ట్యూబ్స్, హైడ్రాలిక్స్, ఇంజినీరింగ్ సేవలు, ప్రాసెస్ అండ్ హీటింగ్ పరికరాల విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించినట్టు, ఇదే సమయంలో ప్రస్తుతం సేవలు అందిస్తున్న రిటైలింగ్, సౌర పరికరాల విభాగాలను క్రమంగా తగ్గించుకుంటూ మూసివేయాలనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం సంస్థలో 10 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, వీరిలో ప్రత్యక్షంగా 3 వేల మందికి, పరోక్షంగా 7 వేల మందికి ఉపాధి లభిస్తున్నది.