ముంబై, అక్టోబర్ 18: హైదరాబాద్కు చెందిన పెన్నా సిమెంట్ ఐపీవోకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆమోదం తెలిపింది. ఐపీవోలో రూ.1,550 కోట్ల విలువైన షేర్లను విక్రయించాలని సంస్థ ప్రతిపాదించింది. రూ.1,300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీచేస్తుండగా, రూ.250 కోట్ల షేర్లను ప్రమోటింగ్ కంపెనీ పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ ఆఫర్లో విక్రయించనుంది. ప్రస్తుతం కంపెనీలో పీఆర్ సిమెంట్కు 33.41 శాతం వాటా ఉంది. సెబీకి పెన్నా సిమెంట్ సమర్పించిన ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవో ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.550 కోట్లు రుణాల్ని చెల్లించడానికి, మరో రూ.105 కోట్లను కేపీ లైన్2 ప్రాజెక్టుకు వ్యయం చేయనుంది. తలారిచెరువు వద్దనున్న గ్రైండింగ్, సిమెంట్ మిల్లును అప్గ్రేడ్ చేయడానికి రూ.80 కోట్లు, ఇక్కడే వేస్ట్ హీట్ రికవరీ ప్లాంటును నెలకొల్పడానికి రూ.110 కోట్లు ఉపయోగిస్తుంది. అలాగే తాండూర్లోని ప్లాంటులో వేస్ట్ హీట్ రికవరీ ప్లాంటు ఏర్పాటుకు రూ.130 కోట్లు ఖర్చుచేయనుంది.