Paytm | ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్ లేదా పేటీఎం’ షేర్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్ లో లోయర్ సర్క్యూట్ రూ.438.35ను తాకింది. మరో 10 శాతం నష్టపోయింది. హవాలా లావాదేవీలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో పేటీఎం మరింత చిక్కుల్లో పడింది. గత మూడు సెషన్లలో పేటీఎం షేర్ 42.4 శాతం విలువ కోల్పోయింది. దీంతో రూ.20,500 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
తాజా వార్తల నేపథ్యంలో మార్కెట్లో ఇన్వెస్టర్లు జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరని, ఇప్పటి వరకు ఉన్న ఇన్వెస్టర్లు తమ స్టాక్స్ విక్రయించడానికి సిద్ధంగా ఉన్నారని యాక్సిస్ సెక్యూరిటీస్ రాజేశ్ పాల్వియా చెప్పారు. 2021 నుంచి హవాలా లావాదేవీలు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆరోపణలపై పేటీఎం.. ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నది.పేటీఎం నుంచి హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు సందేహాలు వ్యక్తం అవుతున్నాయని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు ఉల్లంఘించినట్లు అనుమానాలు ఉన్నాయని కొన్ని నెలల క్రితమే ఈడీ అధికారులను ఆర్బీఐ అలర్ట్ చేసిందని సమాచారం.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో పేరెంట్ సంస్థ ‘పేటీఎం’కు 49 శాతం వాటా ఉంది. తాజా పరిణామాలు పేటీఎం ప్రతిష్టపై ఆందోళనకరంగా ఉన్నాయని జెఫరీస్ అనలిస్ట్స్ పేర్కొంది. దీనివల్ల సుపరిపాలన, రుణ పరపతి బిజినెస్ సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది.