న్యూఢిల్లీ, మే 21: పేటీఎం పేరుతో డిజిటల్ ఆర్థిక సేవలు అందిస్తున్న వన్97 కమ్యూనికేషన్స్..తాజాగా జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలోకి అడుగుపెట్టింది. జాయింట్ వెంచర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేసిన ఈ సంస్థ కోసం పేటీఎం వచ్చే పదేండ్లకాలంలో రూ.950 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. పేటీఎం జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్(పీజీఐఎల్) పేరుతో ఏర్పాటైన సంస్థకు కంపెనీ బోర్డు అనుమతించింది కూడా.
ఈ విషయాన్ని బీఎస్ఈకి సమాచారం అందించింది. ఈ సంస్థలో వన్97 కమ్యూనికేషన్స్(ఓసీఎల్)కి 49 శాతం ఉండనుండగా, మిగతా 51 శాతం వాటా ఓసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ శేఖర్ శర్మకు ఉండనున్నది. వచ్చే పదేండ్లలో పేటీఎం రూ.950 కోట్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ పీజీఐఎల్లో పేటీఎం వాటా 75 శాతానికి చేరుకోనున్నది. అలాగే వీహెచ్పీఎల్ వాటా 26 శాతానికి తగ్గనున్నది. ఈ బీమా సంస్థకు నియంత్రణ మండలి ఐఆర్డీఏఐ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
మరో ఐదేండ్లపాటు విజయ్ శేఖర శర్మనే పేటీఎం మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి శనివారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది. దీంతో ఆయన 2027 వరకు పదవిలో ఉండనున్నారు. అలాగే మధుర్ డియోరా గ్రూపు సీఎఫ్వో, ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.