సురక్షితమైన, సమర్థవంతమైన వాయు రవాణా వ్యవస్థ మూలంగానే హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. విమానాశ్రయ విస్తరణ పూర్తయ్యాక ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి
– ప్రదీప్ పణికర్, జీహెచ్ఐఏఎల్ సీఈవో
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రద్దీ అంతకంతకు పెరుగుతున్నది. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడం, కరోనా తర్వాత వినియోగదారులు ఖర్చులు అధికమవడంతో విమాన ప్రయాణాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 2 కోట్లకు పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఈ విషయాన్ని జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీరిలో 1.76 కోట్ల మంది దేశీయ ప్రయాణికులు కాగా, 34 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులని పేర్కొంది. అలాగే గతేడాది హైదరాబాద్ విమానాశ్రయానికి 1,60,597 విమానాలు రాగా, వీటిలో దేశీయ సర్వీసులు 1,37,640, అంతర్జాతీయ సర్వీసులు 22,957 ఉన్నాయి. కరోనా కంటే ముందు నమోదైన గణాంకాలతో పోలిస్తే 2022-23లో ప్రయాణికుల రద్దీ 97 శాతంగా ఉన్నది.
రద్దీ విమానాశ్రయాల్లో నాలుగో స్థానం..
దేశీయ విమానాశ్రయాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ హవా కొనసాగుతున్నది. ప్రయాణికుల రద్దీలో ఆరో స్థానంలో ఉన్న ఎయిర్పోర్ట్ 2022-23లో నాలుగో స్థానానికి ఎగబాకింది. కరోనాతో అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోగా..ఇటీవలకాలంలో తిరిగి ప్రారంభమయ్యాయి.