న్యూఢిల్లీ, నవంబర్ 21: భారతీయ క్యాపిటల్ మార్కెట్లలోకి పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్) ద్వారా వచ్చే పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ ఆఖరుకల్లా దేశీయ ఈక్విటీ, డెట్ మార్కెట్లతోపాటు హైబ్రిడ్ సెక్యూరిటీల్లో పీ-నోట్ల విలువ రూ.1.26 లక్షల కోట్లకే పరిమితమైంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ వివరాల ప్రకారం గత నెల 31 నాటికి రూ.1,26,320 కోట్లుగానే ఉన్నాయి.
అంతకుముందు నెల సెప్టెంబర్ 30న ఆరేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ రూ.1,33,284 కోట్ల వద్ద ఉండటం గమనార్హం. నిజానికి ఈ ఏడాది మార్చి నుంచి వరుసగా ఏడు నెలలు పెట్టుబడులు పెరిగాయి. అయితే గత నెలలో మాత్రం తగ్గాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో నేరుగా నమోదుకాని విదేశీ ఇన్వెస్టర్లకు రిజిస్టర్డ్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్పీఐ) జారీ చేసేవే ఈ పార్టిసిపేటరీ నోట్స్. ఇవి జూలై 2017న రికార్డు స్థాయిలో రూ.1.35 లక్షల కోట్లను తాకాయి. మళ్లీ ఆ దరిదాపుల్లోకి ఈ సెప్టెంబర్లోనే వెళ్లాయి.
ఇక ఈ ఏడాది జనవరి 31న రూ.91,469 కోట్లుగా ఉన్న పీ-నోట్స్ల్లోని పెట్టుబడులు.. ఫిబ్రవరిలో రూ.88,398 కోట్లకు దిగజారాయి. మార్చి ఆఖరున మళ్లీ రూ.88,600 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్లో రూ.95,911 కోట్లకు, మేలో రూ.1.04 లక్షల కోట్లకు, జూన్లో రూ.1.13 లక్షల కోట్లకు, జూలైలో రూ.1.23 లక్షల కోట్లకు, ఆగస్టులో రూ.1.28 లక్షల కోట్లకు పెరుగుతూపోయాయి.
స్టాక్ మార్కెట్లలోకే..
ప్రస్తుత పీ-నోట్స్ల్లో ఉన్న పెట్టుబడుల్లో స్టాక్ మార్కెట్లలోకి వచ్చినవే అధికం. రూ.1.18 లక్షల కోట్లు ఈక్విటీలవే. డెట్ మార్కెట్లకు చెందినవి రూ.8,055 కోట్లుగా ఉన్నాయి. హైబ్రిడ్ సెక్యూరిటీల్లో రూ.385 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఎఫ్పీఐల నుంచి వచ్చే పెట్టుబడుల ఆధారంగానే పీ-నోట్స్ల్లో పెట్టుబడుల హెచ్చుతగ్గులుంటాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు, రుణ మార్కెట్లు, హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి ఎఫ్పీఐ పెట్టుబడులు పెరిగితే.. పార్టిసిపేటరీ నోట్స్ల్లో కూడా పెట్టుబడులు పెరుగుతాయి. ఒకవేళ వాటిలో తగ్గితే పీ-నోట్స్ల్లో కూడా తగ్గుతాయి.
ఇదిలావుంటే అక్టోబర్ ఆఖరు నాటికి ఎఫ్పీఐల కింద ఉన్న ఆస్తులు రూ.56.8 లక్షల కోట్లకు పడిపోయాయి. సెప్టెంబర్ 30న ఇవి రూ.58.45 లక్షల కోట్లుగా ఉన్నాయి. అక్టోబర్లో భారతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎఫ్పీఐలు రూ.24,500 కోట్ల పెట్టుబడుల్ని వెనుకకు తీసుకున్నారు. అయినప్పటికీ ఇదే నెలలో రుణ మార్కెట్లలోకి దాదాపు రూ.6,400 కోట్ల పెట్టుబడుల్ని పెట్టారు. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ల్లో పెరుగుదలే.. భారత స్టాక్ మార్కెట్లలో ఎఫ్పీఐ పెట్టుబడుల ఉపసంహరణకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కూడా ఇందుకు దోహదం చేసినట్టు చెప్తున్నారు.