న్యూఢిల్లీ: నాలుగేండ్లలో ప్రతి ఏటా 13 శాతానికి పైగా అభివృద్ధి సాధిస్తే తప్ప 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవదని యూనివర్సిటీ ఆఫ్ మాస్సాచుసెట్స్ ప్రొఫెసర్ వంశీ వకులాభరణం పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొవిడ్-19 మహమ్మారి అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇతర అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే గతేడాది కాలంలో భారత్ ఆర్థిక రంగం శరవేగంగా దెబ్బతిన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ జీడీపీ మూడు లక్షల కోట్ల డాలర్లు. నాలుగేండ్లలో ఐదు లక్షల కోట్ల డాలర్లకు భారత జీడీపీని తీసుకెళ్లాలంటే వచ్చే నాలుగేండ్లలో సగటున 13 శాతానికి పైగా అభివృద్ధి సాధించాల్సి ఉంటుందన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రస్తుత అభివృద్ధి అంచనాలు 2018-19తో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయని వంశీ వకులాభరణం గుర్తు చేశారు. గతేడాది 7.3 శాతానికి పడిపోయిన దేశీయ జీడీపీ.. ఈ ఏడాది 9.3 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఐఎంఎఫ్ కూడా భారత్ జీడీపీ వృద్ధిరేటు 9.5 శాతం ఉంటుందని పేర్కొన్నది. ప్రపంచ బ్యాంకు మాత్రం 7.5 శాతానికి పరిమితం అవుతుందన్నది.
2019లో ప్రధాని మోదీ ఇలా
2019లో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ 2024-25 నాటికి భారత్ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకు రావాలన్నారు. గ్లోబల్ పవర్ హౌస్గా ఎదగాలని ఆకాంక్షించారు.