Pan-Aadhar Link | పాన్తో ఆధార్ను లింక్ చేయడంలో జాప్యానికి విధిస్తున్న జరిమానాను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమర్థించారు. మార్చి నెలాఖరుతో పాన్ – ఆధార్ గడువును పూర్తిగా.. సీబీడీటీ జూన్ నెలాఖరు వరకు పొడించింది. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పాన్ – ఆధార్ లింక్ చేసుకుంటున్న వారికి రూ.1000 వరకు జరిమానా విధిస్తున్నది. వాస్తవానికి గతేడాది మార్చి 31తో గడువు ముగియగా.. ఆ తర్వాత రూ.500 జరిమానా విధించారు. గడువు ముగిసిన తర్వాత పాన్తో ఆధార్ను అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పని చేయదని సీబీడీటీ స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం విలేకరుల సమావేశంలో ఈ విషయంపై స్పందించారు. పాన్తో ఆధార్ను అనుసంధానించేందుకు చాలా సమయం ఇచ్చామన్నారు. ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసుకొని ఉండాల్సిందన్నారు. ఇప్పటి వరకు చేయని వారు సైతం చేసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా.. గడువులోగా పాన్-ఆధార్ అనుసంధానం చేయకపోతే పాన్కార్డుతో ఎలాంటి లావాదేవీలు చేసేందుకు అవకాశం ఉండది. మీకు ఏవైనా రీఫండ్స్ రావాల్సి ఉన్నట్లయితే.. ఈ విషయంలో ఇబ్బందులెదువుతాయి. రిటర్న్స్ను సైతం సరిచేయడం వీలుకాదు. దీని ఫలితంగా ఎక్కువ పన్ను చెల్లించాల్సి వస్తుంది.