Personal Finance | మనం ఇప్పుడు నూతన సంవత్సరంలో ఉన్నాం.. ప్రతి సంవత్సరంలో మాదిరిగానే 2022లోనూ వివిధ పర్సనల్ ఫైనాన్స్ డెడ్లైన్లు ఉన్నాయి. ఆయా పర్సనల్ ఫైనాన్స్ డెడ్లైన్లకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో జరిమానాలు చెల్లించాల్సి రావచ్చు. గతేడాది 16 రకాల డెడ్లైన్లను ప్రతి ఒక్కరూ పాటించారు. కానీ ఈ ఏడాది అవి 12కు చేరుకుందాం..
2022లో ఆయా ఫైనాన్సియల్ డెడ్లైన్లు ఏమిటో ఓ లుక్కేద్దాం..
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్లు దాఖలు చేసిన వారికి ఆదాయం పన్నుశాఖ వన్టైం రిలాక్సేషన్ అవకాశం కల్పించింది. ఐటీఆర్ల ఈ-వెరిఫికేషన్ పెండింగ్లో ఉంటే.. ఐటీఆర్-5 పత్రాలు భౌతికంగా గానీ..ఈ-వెరిఫికేషన్ ద్వారా గానీ సమర్పించాలి. పన్ను చెల్లింపుదారులు వచ్చేనెల 28 లోగా సదరు పత్రాలను సబ్మిట్ చేసి ఈ-వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని ఐటీశాఖ తెలిపింది.
వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు.. ఆర్థిక రంగ సంస్థల్లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ వస్తుంది. ప్రతి యేటా పెన్షన్ నిరంతరాయం గా పొందడానికి పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అందుకు గడువును వచ్చేనెల 28 వరకు కేంద్రం పొడిగించింది. ఇంతకుముందు ఈ గడువును గతనెలాఖరు వరకు పొడిగించింది. ఒకవేళ వచ్చేనెల 28 లోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పించని పెన్షనర్లకు పెన్షన్ వారి ఖాతాల్లో జమ కాదు.. అయితే, వార్షిక లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి పెన్షనర్లకు ఐదు మార్గాలు ఉన్నాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ చేయడానికి తుది గడువు మార్చి 15. ప్రతి ఒక్క వ్యక్తి 100 శాతం అడ్వాన్స్ టాక్స్ పేమెంట్ చేయాలి. ఒకవేళ మీరు గడువులోగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించకుంటే ఐటీ చట్టంలోని 234ఏ, 234 బీ సెక్షన్ల కింద వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు షేర్లపై డివిడెండ్ ఆదాయం పొందినా, స్టాక్స్/ డెట్ మ్యూచ్వల్ ఫండ్స్ పైనా క్యాపిటల్ గెయిన్స్ పొందినా పూర్తిగా అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ నుంచి మినహాయింపు ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఒకవేళ మీరు మీ ఆధార్ కార్డును పాన్కార్డ్తో అనుసంధానించలేదా.. వచ్చే మార్చి నెలాఖరులోగా వాటిని అనుసంధానించడం ముఖ్యం. ఒకవేళ ఈ గడువులోగా మీరు పాన్-ఆధార్ కార్డులను అనుసంధానించక పోతే మీ పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్గా మారుతుంది. గడువు తర్వాత అనుసంధానించుకుంటే రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధార్తో అనుసంధానించకుండా పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్గా మారితే మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్స్లో నిధులు మదుపు చేయడం కష్ట సాధ్యం అవుతుంది.
మీరు 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ సమర్పించడం మిస్ అయ్యారా.. వచ్చే మార్చి నెలాఖరులోగా సబ్మిట్ చేయడం మరిచిపోవద్దు. ఈ నెల ఒకటో తేదీ నుంచి మార్చి 31 లోపు సమర్పించే ఐటీఆర్లను మరీ ఆలస్యం (belated ITR) ఐటీఆర్ అని పేర్కొంటారు. రూ.5000 వరకు లేట్ ఫైలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల్లోపు ఆదాయానికి రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ ఒర్జినల్ ఐటీఆర్ ఫైలింగ్లో పొరపాటు దొర్లినట్లు కనుగొంటే మీరు రివైజ్డ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఆదాయం పన్ను చట్టం-1961లోని 139 (5) సెక్షన్ ప్రకారం రివైజ్డ్ ఐటీఆర్ సమర్పించాలి. వచ్చే మార్చి 31 లోపు రివైజ్డ్ ఐటీఆర్ సబ్మిట్ చేయాలి.
ఒకవేళ మీరు 2021-22 ఆర్థిక సంవత్సరానికి పాత టాక్స్ విధానాన్ని ఎంచుకున్నారనుకోండి. ఆదాయం పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపు పొందేందుకు అవసరమైన కసరత్తు మార్చి నెలాఖరులోగా కంప్లీట్ చేయడం బెటర్. ఐటీ చట్టం 80సీ కింద రూ.1.5 లక్షలు, ఎన్పీఎస్ కంట్రిబ్యూషన్లకు 80సీసీడీ (1బీ) కింద రూ.50 వేలు, మెడికల్ బీమా ప్రీమియం కింద రూ.25 వేలు లేదా రూ.50 వేలు మినహాయింపు పొందొచ్చు.
వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ బ్యాంకులకు కేవైసీ పత్రాలు సమర్పించడానికి తుది గడువు మార్చి 31. ఇంతకుముందు 2021 డిసెంబర్ నెలాఖరు వరకు మాత్రమే ఉన్నా.. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ నేపథ్యంలో మార్చి 31కి పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. కనుక ఖాతాదారులు తాజా గడువు లోపు బ్యాంకులను సంప్రదించి కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. గడువు పొడిగించిన సమయం వరకు ఆయా బ్యాంకులు నగదు విత్ డ్రాయల్స్కు ఇబ్బందులు కలుగనివ్వవు.
ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులు తొలి విడుత అడ్వాన్స్ టాక్స్ చెల్లింపునకు తుది గడువు జూన్ 15. ఈ గడువులోగా అడ్వాన్స్ టాక్స్లో 15 శాతం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆదాయం పన్ను చట్టంలోని 234బీ, 234సీ సెక్షన్ల కింద సదరు టాక్స్పై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్లైన్లో సురక్షితంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లావాదేవీలు జరుపడానికి ఆర్బీఐ తీసుకొచ్చిన టోకెనైజేషన్ వ్యవస్థ అమలు గడువును జూన్ 30కి పొడిగించింది. వివిధ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఈ-మెయిల్స్, ఎస్సెమ్మెస్లు పంపిన తర్వాత అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి మర్చంట్ వెబ్సైట్ల నుంచి బ్యాంకుల ఖాతాదారుల కార్డుల వివరాలు డిలిట్ అవుతాయి. జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి కస్టమర్ ఆన్లైన్లో ఏ లావాదేవీ జరుపాలన్నా 16 అంకెల సంఖ్య నమోదు చేయాలి. లేదా దానికి బదులు టోకెన్ నంబర్ తీసుకోవాల్సి ఉంటుంది. సైబర్ మోసాలను నివారించడానికి ఆర్బీఐ ఈ టోకెనైజేషన్ విధానాన్ని తీసుకొస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు 2022 జూలై 31. ఒకవేళ ఈ గడువును ప్రభుత్వం పొడిగించకపోతే.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే టాక్స్ పేయర్లు రూ.5000 వరకు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో రెండో విడుత అడ్వాన్స్ పేమెంట్ గడువు సెప్టెంబర్ 15తో ముగుస్తుంది. పన్ను చెల్లింపుదారులు 45 శాతం అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి.
వచ్చే ఆర్థిక సంవత్సరానికి అడ్వాన్స్ టాక్స్ పేమెంట్స్ గడువు డిసెంబర్ 15తో ముగుస్తుంది. పన్ను చెల్లింపుదారులు 75 శాతం అడ్వాన్స్ టాక్స్ చెల్లించాలి. లేని పక్షంలో సదరు పన్నుపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.