EPFO | న్యూఢిల్లీ, మార్చి 4: వృద్ధాప్యంలో ఎక్కువ పెన్షన్ పొందవచ్చన్న వేతన జీవుల ఆశలపై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) నీళ్లు చల్లింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోమ్మంటూ ఈపీఎఫ్వో యాక్టివేట్ చేసిన పోర్టల్లో సంక్లిష్టమైన నిబంధనలతో ఉద్యోగుల్ని హతాశుల్ని చేసింది. ఇందుకోసం దరఖాస్తు చేయడం దాదాపు అసాధ్యం చేసింది. ఈపీఎఫ్ స్కీమ్ 1952 కింద నిర్దేశించిన వేతన పరిమితిని మించి వాస్తవ వేతనం (బేసిక్+డీఏ)పై అధిక మొత్తాన్ని ఈపీఎఫ్వోకు జమచేస్తే ఉద్యోగులు, యాజమాన్యాలు ఉమ్మడిగా ఈపీఎఫ్వో నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉంది. ఇప్పుడు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేయాలంటే గతంలో పొందిన అనుమతి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించడాన్ని తప్పనిసరి చేస్తూ ఈపీఎఫ్వో షరతు విధించింది.
ఈపీఎఫ్వో చందాదారులకు పెన్షన్ సదుపాయాన్ని కల్పించేందుకు 1996 మార్చిలో ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) ప్రవేశపెట్టారు. అప్పుడు గరిష్ఠ పెన్షన్బుల్ వేతనాన్ని నెలకు రూ. 5,000గా నిర్దేశించారు. తర్వాత దానిని రూ.6,500కు పెంచారు. 2014 సెప్టెంబర్ 1 నుంచి దీనిని రూ. 15,000 చేశారు. ఈ వేతనంపై జరిపే చెల్లింపుల్నే పెన్షన్ కోసం ఈపీఎఫ్వో పరిగణనలోకి తీసుకుంటున్నది. కానీ ఈపీఎఫ్వో నిర్దేశించిన గరిష్ఠ వేతన పరిమితి ఉన్నప్పటికీ, అంతకు మించి వాస్తవ వేతనం లేదా అధిక వేతనంలో 12 శాతాన్ని ఉద్యోగి చెల్లించవచ్చు. అంతే మొత్తాన్ని యజమాని జమచేయవచ్చు. అయితే ఈపీఎఫ్వో నిబంధనల్లోని పేరా 26 (6) ప్రకారం వాస్తవ వేతనంపై చెల్లింపులకు ఈపీఎఫ్వో కమిషనర్ ముందస్తు అనుమతిని ఉద్యోగి, యజమాని పొందాల్సి ఉంటుంది.
అధిక పెన్షన్కు గతంలో దరఖాస్తు చేసుకోనివారికి మరోసారి ఆప్షన్ ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు జారీచేసిన ఉత్వర్వుల ప్రయోజనాన్నే ప్రస్తుతం ఈపీఎఫ్వో దెబ్బతీస్తున్న పరిస్థితి ఏర్పడింది. పేరా 26(6)లోని షరతును తవ్వితీసి, గతంలో పీఎఫ్ కమీషనర్ అనుమతి పొంది న ధ్రువీకరణకు తాజా దరఖాస్తుకు జతచేయాలని ఫండ్ అడుగుతున్నది. వాస్తవానికి ఈపీఎఫ్ స్కీమ్లోని పేరా 26(6) ప్రొవిజన్ పాటించాలన్న అంశంపై పట్టుపడ్డవద్దంటూ ఈపీఎఫ్వో తన ప్రాంతీయ పీఎఫ్ కమీషనర్లను కోరుతూ 2019 జనవరిలో ఒక సర్క్యులర్ను జారీచేసిందని నిపుణులు, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్లు గుర్తు చేస్తున్నారు. గరిష్ఠ పెన్షన్బుల్ పరిమితిని మించి వాస్తవ వేతనాలపై ఉద్యోగి, యజమాని ఈపీఎఫ్ స్కీమ్కు చెల్లింపులు చేస్తూ ఉండి, అందుకు ఉమ్మడిగా ఆప్షన్ ఇవ్వకపోయినా, అటువంటి చెల్లింపుల్ని ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినట్టేనని, దానిని ఈపీఎఫ్వో ఆమోదించినట్టేనన్నది ఈ సర్క్యులర్ సారాంశం. సెంట్రల్ రీజనల్ పీఎఫ్ కమిషన్ రాజేష్ బన్సాల్ సంతకంతో 2019 జనవరి 22న జారీ అయిన ఈ సర్క్యులర్ను నెలరోజుల లోపునే ఈపీఎఫ్వో ఉపసంహరించుకుంది. తాజాగా పేరా 26(6) కింద అనుమతిని తప్పనిసరి చేయడంతో చాలా మంది వేతన జీవులు అధిక పెన్షన్ కోసం అనర్హులైనట్టేనని ఒక ఫండ్ మేనేజర్ తెలిపారు. దరఖాస్తు చేసేందుకు సుప్రీం ఇచ్చి న నాలుగు నెలల గడువు ముగియడంతో దీనిని మే 3 వరకూ ఈపీఎఫ్వో పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటివరకూ అధిక పెన్షన్ కోసం డిపాజిట్ చేసే పద్ధతిని, పెన్షన్ను గణించే విధానంపై ఈపీఎఫ్వో వివరణ ఇవ్వలేదు.
ఈపీఎస్ స్కీము ప్రవేశపెట్టినప్పటి నుంచి పెన్షన్బుల్ సేలరీ నిర్దేశిత పరిమితిని మించి పేరా (6) కింద వాస్తవ వేతనంపై పీఎఫ్ చెల్లింపులకు ముందస్తు అనుమతి కోరుతూ ఉద్యోగులు, యజమానుల నుంచి ఉమ్మడి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదట. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ఫిబ్రవరి 3న ఈపీఎఫ్వో సమాధానమిస్తూ 1996 మార్చిలో స్కీము ప్రవేశపెట్టినప్పటి నుంచీ వాస్తవ వేతనంపై చెల్లింపుల కోసం ఒక్క దరఖాస్తూ స్వీకరించలేదని తెలిపింది. కానీ ఎక్కువ పెన్షన్ కోసం అటువంటి అనుమతిని తప్పనిసరి చేసినందున, ఇప్పుడు అధిక పెన్షన్కు దరఖాస్తు చేయడం అసాధ్యంగా మారింది. 1996 మార్చి 16 నుంచి పేరా 26(6) నిబంధన ప్రకారం ఎంతమంది ఉద్యోగులు/సభ్యుల ఉమ్మడి ఆప్షన్ను ఉపయోగించుకున్నారు? అంటూ ఆర్టీఐలో వచ్చిన ప్రశ్నకు బదులిస్తూ తమ ఆఫీసు రికార్డుల ప్రకారం 1996 మార్చి 16 నుంచి 2022 డిసెంబర్ 31 వరకూ ఈపీఎఫ్ స్కీమ్ పేరా 26(6) కింద స్వీకరించిన జాయింట్ ఆప్షన్లు/అండర్టేకింగ్స్ ‘లేవు’ అని ఫండ్ వెల్లడించింది.
అధిక పెన్షన్ పొందేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రయోజనాన్ని అర్హులైన పెన్షనర్లకు అందకుండా ఈపీఎఫ్వో దీనిని ప్రోగ్రామ్ చేసిందని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) ప్రధాన కార్యదర్శి తపన్ సిన్హా ఆరోపించారు. సెంట్రల్ ప్రావిడెంట్ కమీషనర్ నీలం షమీరావుకు తపన్ సిన్హా ఒక లేఖ రాస్తూ ఈపీఎఫ్వో వెబ్సైట్లో higher pension option application ను అప్లోడ్ చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని పరిష్కరించడానికి తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్పై సుప్రీం కోర్టు తీర్పు అమలయ్యేందుకు వీలుగా ఈపీఎఫ్వో ఒక సమగ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.