హైదరాబాద్, మే 13: రాష్ట్రంలో ఆన్లైన్ షాపింగ్ జోరుగా సాగుతున్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం (2022-23) తెలంగాణలో ఈ-ఎనబుల్మెంట్ సాస్ వేదిక యూనికామర్స్ విడుదల చేసిన ఓ నివేదిక స్పష్టం చేసింది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ-కామర్స్ వ్యాపారాన్ని గత రెండున్నరేండ్లుగా యూనికామర్స్ గమనిస్తోంది. సుమారు 3 కోట్ల ఆన్లైన్ ఆర్డర్లను విశ్లేషించి ఈ-కామర్స్ ట్రెండ్స్పై ఓ అంచనాకు వచ్చింది. ఈ క్రమంలోనే తెలంగాణలో ఆన్లైన్ షాపింగ్ వేగంగా పుంజుకుంటున్నదని, హైదరాబాద్, సికింద్రాబాద్ల్లోనే ఎక్కువగా ఆర్డర్లు నమోదవుతున్నాయని యూనికామర్స్ పేర్కొన్నది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ ఆన్లైన్ షాపింగ్ పెరిగిందని వెల్లడించింది. ఇక ఈ ఆన్లైన్ ఆర్డర్లలో రాష్ర్టానికి చెందిన వ్యాపారులు అందుకుంటున్నవి సగటున 70 శాతం పెరుగుతుండటం గమనార్హం.
రాష్ట్రంలో జరుగుతున్న ఆన్లైన్ షాపింగ్లో ఫ్యాషన్ అండ్ యాక్ససరీస్దే హవా. 2021-22తో చూస్తే 2022-23లో ఫ్యాషన్ అండ్ యాక్ససరీస్ ఆన్లైన్ ఆర్డర్లు 55 శాతానికిపైగా పెరిగాయి. వీటిలో దుస్తులు ముఖ్యంగా పిల్లల బట్టలు, పాదరక్షలు, బ్యాగులు, బెల్టులు, వ్యాలెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉన్నది. ఇక సౌందర్య, ఆరోగ్య సంరక్షణ సాధనాలు-ఉత్పత్తుల ఆర్డర్లు రెండో స్థానంలో ఉన్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చి ఆఖరుతో ముగిసిన సంవత్సరంలో 20 శాతం పెరుగుదల కనిపించింది. ఎలక్ట్రానిక్, ఆడియో ఉత్పత్తులకూ భారీగానే ఆదరణ ఉన్నట్టు యూనికామర్స్ చెప్పింది. అంతకుముందుతో పోల్చితే 74 శాతం ఆర్డర్లు పెరిగాయి. గృహాలంకరణ, వంట సామాగ్రి షాపింగ్ కూడా పెద్ద ఎత్తునే జరుగుతున్నది. గతంతో చూస్తే 50 శాతం పెరిగినట్టు తేలింది. ‘హైదరాబాద్లో ఉన్న ప్రముఖ బ్రాండ్లలో మాదీ ఒకటి. పెరుగుతున్న ఆన్లైన్ షాపింగ్తో మా వ్యాపారావకాశాలూ పెరిగాయి. వినియోగదారులూ పెరిగారు’ అని శ్రీ జగదంబ పియర్ల్స్ ఎండీ అవినాశ్ అగర్వాల్ తెలిపారు. కాగా, ఈ-కామర్స్ కార్యకలాపాల నిర్వహణ కోసం వ్యాపార సంస్థలకు యూనికామర్స్ సహకారం అందిస్తున్నది. ప్రస్తుతం రాష్ర్టానికి చెందిన 60కిపైగా సంస్థలతో కలిసి పనిచేస్తున్నది.
‘గత కొన్నేండ్లుగా తెలంగాణలో ఈ-కామర్స్ రంగం వ్యాపారావకాశాలు బాగా పెరిగాయి. ఆన్లైన్ షాపింగ్ విస్తృతంగా జరుగుతున్నది. బలమైన డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్ ఎకోసిస్టమ్కుతోడు టెక్నాలజీపై అవగాహన ఉన్న జనాభా ఎక్కువగా ఉండటం కలిసొస్తున్నది. వ్యాపార సంస్థలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకూ ఇది శుభపరిణామంగానే చెప్పుకోవచ్చు’
-కపిల్ మఖిజా, యూనికామర్స్ సీఈవో