న్యూఢిల్లీ, మార్చి 10: బంగారం, వెండి ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ నెలకొనడంతోపాటు డాలర్ డిమాండ్ పడిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ఏకంగా రూ.11 వేలు ఎగబాకి రూ.2.79 లక్షలకు చేరుకున్నది.
గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి మంగళవారం ఏకంగా 4 శాతం ఎగబాకినట్టు అయింది. అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.400 అందుకొని రూ.1,64,700 పలికింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు త్వరలో సద్దుమణిగే అవకాశాలున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో అతి విలువైన లోహాలు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 5,172.86 డాలర్లకు చేరుకోగా, వెండి 1.38 డాలర్లు అందుకొని 88.33 డాలర్లకు చేరుకున్నది.