Ola IPO in 2022 | క్యాబ్ సర్వీస్ అగ్రిగేటర్ ఓలా ఐపీవో (ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్) ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ మార్కెట్లోకి ప్రవేశించనున్నదని సమాచారం. 150 నుంచి 200 కోట్ల డాలర్ల నిధులను సేకరించాలని ఓలా ప్రణాళికలు సిద్ధం చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా నిధులను సేకరించనున్నది ఓలా..
ఇప్పటికే ఐపీవో నిర్వహణ బాధ్యతలు చేపట్టే బ్యాంకులను ఖరారు చేసే ప్రక్రియలో ఉన్నాం అని ఓలా తెలిపింది. అందుకోసం సిటీ బ్యాంక్, జేపీ మోర్గాన్, కొటక్ మహీంద్రా బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ సంస్థలతో చర్చలు జరుపుతున్నది.
2021 చివరి త్రైమాసికం నాటికి స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి తమ ఐపీవో ముసాయిదా నివేదిక సమర్పించనున్నది. దీని ప్రకారం ఈ ఏడాది చివర్లో గానీ, 2022 ప్రారంభంలో గానీ ఓలా ఐపీవో మార్కెట్ను తాకనున్నదని తెలుస్తోంది.
కరోనా మహమ్మారి ప్రభావంతో గత మార్చిలో ఓలా మార్కెట్ వాల్యూ సుమారు 3.3 బిలియన్ల డాలర్లకు పడిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ భవిష్యత్ ప్రణాళికలను అమలు చేయడానికి ఐపీవో ద్వారా 800 కోట్ల డాలర్ల నిధులు సేకరించేందుకు సెబీని కోరే అవకాశం ఉందని సమాచారం.