బెంగళూరు: ప్రముఖ క్యాబ్ సర్వీసెస్ సంస్థ ఓలా నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో విపణిలో అడుగు పెట్టనున్నది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కోసం తమిళనాడులో రూ.2400 కోట్ల పెట్టుబడి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ప్రొడక్షన్ ప్లాంట్ నిర్మిస్తున్నది.
ఫ్యాక్టరీ నిర్మాణంతోపాటు దేశవ్యాప్తంగా హైపవర్ ఛార్జర్ నెట్వర్క్నూ ఏర్పాటు చేస్తామని భవిష్ అగర్వాల్ తెలిపారు. హై-స్పీడ్ ఛార్జింగ్ ఆప్షన్లతో పాటు హోం ఛార్జర్లు కూడా అందుబాటులో ఉంచనున్నది ఓలా ఎలక్ట్రిక్. ఈ స్కూటర్ విపణిలో అడుగు పెడితే బజాజ్ ఎలక్ట్రిక్ చేతక్, అథేర్ ఎనర్జీ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.
ఈ నేపథ్యంలో త్వరలో ఈ-స్కూటర్ విపణిలోకి రానున్నదని సంకేతాలిస్తూ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. స్కూటర్కు సంబంధించిన పలు ఫీచర్లను వీడియో ద్వారా పరిచయం చేశారు. స్కూటర్ సీటు కింది భాగంలో రెండు హాఫ్ హెల్మెట్లు పెట్టడానికి సరిపడా ప్రదేశం ఉంటుంది.
ఈ ట్వీట్ చదివే లోపే 60కి.మీ. వేగాన్ని ఈ స్కూటర్ అందుకుంటుందని తెలిపారు. మార్చుకునేందుకు వీలుగా ఉండే ఈ స్కూటర్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్నది.
వచ్చే కొన్ని నెలల్లో ఈ ప్రొడక్షన్ ప్లాంట్ నుంచి విద్యుత్ స్కూటర్ల తయారీ ప్రారంభం అవుతుందని ఓలా ఎలక్ట్రిక్ ఇటీవలే ప్రకటించింది. ఏడాదిలో కోటి స్కూటర్లను తయారు చేసే వసతులను ఈ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రకారం రెండు సెకన్లకు ఒక స్కూటర్ తయారీ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.