Petrol Price | ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలు డిమాండ్కు సరిపడా ఉత్పత్తి చేయకుండా కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలీ చెప్పారు. దీనివల్లే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయని సోమవారం రాజ్యసభ క్వశ్చన్ అవర్లో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సహేతుకంగా ఉండాలని, మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ధరల్ని నిర్ణయించాలని భారత్ తెలిపింది.
డిమాండ్కు అనుగుణంగా ముడి చమురు ఉత్పత్తి చేయకపోవడంపై ఒపెక్ దేశాల కూటమికి భారత్ పలుసార్లు నిరసన వ్యక్తం చేసిందని రామేశ్వర్ తేలీ చెప్పారు. ప్రపంచంలోనే చమురు దిగుమతి, వినియోగంలో భారత్ మూడో అతిపెద్ద దేశంగా ఉన్నది. దేశీయంగా పెట్రోల్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా దేశీయంగా ఆభారం ప్రజలపై మోపుతున్నట్లు కేంద్రం వాదిస్తున్నది. కానీ ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తడంతో ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వ్యూహాత్మక చమురు నిల్వలను మార్కెట్లోకి విడుదల చేయాలని అమెరికా, భారత్, చైనా, జపాన్ నిర్ణయించాయి.