Red Sea | న్యూఢిల్లీ, జనవరి 12: ఎర్ర సముద్రంలో నెలకొన్న పరిస్థితులు.. అంతర్జాతీయ చమురు మార్కెట్లో కల్లోలం రేపుతున్నాయి. యెమన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చెందిన డజనుకుపైగా స్థావరాలపై అమెరికా, బ్రిటన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. అటు ఆకాశం నుంచి, ఇటు సముద్ర జలాలపై నుంచి అగ్రరాజ్యాల దాడులు జరుగుతున్నాయి. దీనికి మరికొన్ని దేశాల మద్దతు కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే చమురు ధరలు 3 శాతం మేర పెరిగాయి. గాజా విషయంలో ఇజ్రాయెల్ తీరును నిరసిస్తూ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ రెబల్స్ దాదాపు రెండు నెలలుగా దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇది ఇజ్రాయెల్తోపాటు ఆసియా, ఐరోపా వర్తక, వాణిజ్యాన్నే దెబ్బతీస్తున్నది. ముఖ్యంగా ఆ దారి గుండా జరుగుతున్న చమురు రవాణాపై ప్రభావం పడుతున్నది.
ఇప్పటికే ట్యాంకర్లు ఆ మార్గాన్ని కాదని దూరం ఎక్కువైనా వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. తాజాగా అమెరికా, బ్రిటన్ల జోక్యంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో ఎర్ర సముద్రం మీదుగా అరకొరగా నడిచే నౌకలు కూడా ఆగిపోవాల్సి వస్తున్నది. ఫలితంగా రవాణా, ఇతరత్రా ఖర్చులు పెరిగిపోగా, సహజంగానే అది చమురు ధరల్ని ఎగదోస్తున్నది. అందులో భాగంగానే బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 2.21 డాలర్లు లేదా 2.9 శాతం పెరిగి 79.62 డాలర్లకు చేరింది. అమెరికా, వెస్ట్ టెక్సాస్ అంతర్జాతీయ క్రూడ్ ఫ్యూచర్స్లో సైతం 2.13 డాలర్లు లేదా 3 శాతం ఎగిసి 74.15 డాలర్లు పలికింది.
తాజా పరిణామాలన్నింటినీ నిశితంగా గమనిస్తున్నామని సౌదీ అరేబియా అన్నది. చమురు ఎగుమతిదారుల్లో సౌదీ టాప్ అన్న సంగతి విదితమే. భారత్కూ పెద్ద ఎత్తున ఇది క్రూడ్ను ఎగుమతి చేస్తున్నది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఇప్పటిదాకా సౌదీ ధరల్ని పెంచలేదు. అందుకే భారత్కూ పెద్దగా ఇబ్బంది రాలేదు. అయితే గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా పెంచాలన్న ఒత్తిడి ఒపెక్ దేశాల నుంచి సౌదీపై వస్తే.. ఆ ప్రభావం భారతీయ మార్కెట్పై తప్పక ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. అగ్ర రాజ్యాల జోక్యం ఈ వ్యవహారాన్ని ప్రపంచవ్యాప్తం చేసిందన్న వాదనలూ వ్యక్తమవుతున్నాయి.
రెడ్ సీలో సంక్షోభం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశీయ ఎగుమతుల్ని గత ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 6.7 శాతం మేర తగ్గించవచ్చన్న అంచనాలున్నాయి. 2022-23లో భారత్ నుంచి 451 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. అయితే ఈసారి 421 బిలియన్ డాలర్లకే పరిమితం కావచ్చని రిసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ (ఆర్ఐఎస్) చెప్తున్నది. దీంతో 30 బిలియన్ డాలర్ల (రూ.2.50 లక్షల కోట్లు) వరకు పడిపోవచ్చని తెలుస్తున్నది. ఎర్ర సముద్రంలో సరకు రవాణా నౌకలకు హౌతీ మిలిటెంట్ల నుంచి ప్రమాదం పొంచి ఉండటంతో కంటైనర్ షిప్పింగ్ రేట్లు అమాంతం పెరిగాయి.
అంతేగాక ప్రయాణ ఖర్చులు, కంటైనర్లలోని సరకులకు సంబంధించిన బీమా ప్రీమియంలూ భారంగా తయారయ్యాయి. దీంతో ఎగుమతిదారులు వెనుకడుగు వేస్తున్నట్టు ఆర్ఐఎస్ డైరెక్టర్ సచిన్ చతుర్వేది చెప్తున్నారు. ఇప్పటికే భారతీయ ఎగుమతిదారులు 25 శాతం ఎగుమతుల్ని ఆపేసినట్టు దేశీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ తెలిపారు. ఇక గత నెల ప్రథమార్ధంతో పోల్చితే ఇప్పుడు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే నౌకలు దాదాపు 44 శాతం తగ్గాయని ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రోకర్ క్లార్క్సన్ రిసెర్చ్ గుర్తుచేస్తున్నది. సరకు రవాణా సామర్థ్యం కూడా 40 లక్షల టన్నుల నుంచి 25 లక్షల టన్నులకు తగ్గిందంటున్నది.
గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు విరుచుకుపడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతున్నది. ఆసియా, ఐరోపా దేశాల మధ్య వర్తక, వాణిజ్యానికి వీలుగా హిందూ మహాసముద్రం, మెడిటరేనియన్ సముద్రం నడుమ ఉండే దారే ఈ ఎర్ర సముద్రం. దీనికి ఒక చివరన సూయెజ్ జలసంధి ఉంటే.. మరో చివరన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి. 30 కిలోమీటర్ల వెడల్పుండే ఈ బాబ్ ఎల్-మండేబ్ జలసంధిలోనే నిరుడు నవంబర్లో కనీవినీ ఎరుగని రీతిలో హెలీక్యాప్టర్ నుంచి ఓ నౌకను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ మార్గం గుండా మార్స్, హపాగ్-లాయిడ్ వంటి అగ్రశ్రేణి షిప్పింగ్ కంపెనీలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా ఆపేశాయి. మరికొన్ని సంస్థలు తమ కంటైనర్ల ధరల్ని బాగా పెంచి నడిపించే ధైర్యం చేస్తున్నాయి. ఈ పరిణామం యావత్తు ఆసియా-ఐరోపా ట్రేడింగ్ను ప్రభావితం చేస్తున్నదిప్పుడు. ప్రపంచ వాణిజ్యంలో ఈ మార్గం గుండా జరిగే ఎగుమతి-దిగుమతుల వాటా 12 శాతంగా ఉన్నది. నిజానికి మొదట్లో ఇజ్రాయెల్ నౌకలనే హౌతీ రెబల్స్ లక్ష్యంగా చేసుకున్నారు. కానీ ఆ తర్వాత అన్ని నౌకలపైనా క్షిపణులతో దాడులకు తెగబడుతున్నారు.