హైదరాబాద్, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని మూడు ప్రధాన పారిశ్రామికవాడల్లో ఇప్పటికే కంపెనీలు నిర్వహిస్తున్న లీజుదారులకు ప్లాట్లను విక్రయించే ప్రక్రియను పరిశ్రమల శాఖ అధికారులు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా లీజుదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ప్లాట్ల విక్రయంలో ముందుగా వాస్తవ లీజు దారులకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా గతంలో ప్రభుత్వం నామమాత్ర లీజుపై కంపెనీలకు స్థలాలను కేటాయించింది.
కాలక్రమేనా చాలా పరిశ్రమలు వివిధ కారణాలతో ఖాయిలాపడడంతో లీజుదారులు వాటిని ఇతరులకు విక్రయించారు. దీంతో ఎక్కువశాతం ప్లాట్లలో మొదట్లో ప్రభుత్వం ద్వారా లీజు హక్కులు పొందినవారు ఆక్యుపేషన్లో లేకుండా పోయారు. మరోవైపు, నగరం అన్ని వైపులుగా విస్తరించడంతో ప్రభుత్వం నగరంలోని పరిశ్రమలను ఔటర్ రింగ్రోడ్డు వెలుపలికి తరలించాలని విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. అలాగే పారిశ్రామిక వాడల్లోని స్థలాలను భూ వినియోగ మార్పునకు అనుమతివ్వాలని నిర్ణయించింది. అంతేకాకుండా గతంలో లీజులు పొందినవారు తమ స్థలాలను ఇతర వ్యాపారాలకు మార్చుకునేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని ఆజామాబాద్, బాలానగర్, హఫీజ్పేట్ పారిశ్రామికవాడల్లోని ప్లాట్లను విక్రయిస్తున్నారు. వీటిని నిర్ణీత ధరను చెల్లించేందుకు ముందుకొచ్చే లీజుదారులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, అలాగే, లీజుదారులు ఇప్పటికే ఇతరులకు విక్రయించినైట్లెతే ఆ కొనుగోలుదారుల నుంచి నిర్ణీత ధరను వసూలుచేసి వారికి విక్రయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆక్యుపేషన్లో ఉన్నవారికి పరిశ్రమల శాఖ అధికారులు నోటీసులు జారీచేస్తున్నారు.