హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): దేశ మెట్రో రైలు చరిత్రలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీసు కార్యకలాపాల్ని నిర్వహించుకునేందుకు వీలుగా ఎల్ అండ్ టీ మెట్రోరైల్ (హైదరాబాద్) సరికొత్తగా ‘ఆఫీసు బబుల్స్’ పేరుతో కో-వర్కింగ్ స్పేసెస్ను ఆఫర్ చేయడానికి సిద్దమయ్యింది. నగరంలో కో-వర్కింగ్ స్పేస్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రోరైల్ గురువారం తెలిపింది. ముఖ్యంగా ఐటీ కంపెనీలను దృష్టిలో ఉంచుకుని ఆఫీస్ బబుల్స్ను నెలకొల్పుతున్నామని, దీంతో ఆయా కంపెనీలు నగరవ్యాప్తంగా చిన్నచిన్న ఆఫీసులుగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందని వివరించింది. వర్క్, షాపింగ్, లీజర్, ఎంటర్టైన్మెంట్, హెల్త్కేర్ విభాగాల కోసం మెట్రో రైల్లో 18.5 మిలియన్ చదరపు అడుగుల ట్రాన్సిట్ ఓరియెంటెడ్ స్పేస్ డెవలప్మెంట్ (టీవోడీ) అందుబాటులో ఉందని పేర్కొంది. మెట్రో స్టేషన్లలో అన్పెయిడ్ (టికెట్లు తీసుకునేముందు) ఏరియాలను టీవోడీలుగా ఉపయోగించుకుంటుంది.
లీజుకు ఇచ్చే ఆఫీస్ బబుల్స్ ఏర్పాటుకోసం 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయిస్తున్నది. మెట్రో స్టేషన్లలో ఆఫీసు కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు వారి ఇంటికి దగ్గర ఉండే మెట్రో స్టేషన్లో ఏర్పాటయ్యే కార్యాలయంలో పని చేయడానికి చైతన్యం కలిగిస్తుందని ఇది కంపెని పురోగతికి ఎంతగానో తోడ్పుడుతుందని ఎల్ అండ్ టీ వివరించింది. అదే విధంగా ఉద్యోగుల రవాణాకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుందన్నది. 49 మెట్రో స్టేషన్లలో 1750 చదరపు అడుగులతో రెండు యూనిట్లు, 8 జంక్షన్ స్టేషన్లలో 5 నుంచి 30 వేల చదరపు అడుగుల యూనిట్ల ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. దేశంలో తొలిసారిగా సరికొత్త ఆఫీసు బబుల్స్ను ఆఫర్ చేయడం తమకు గర్వకారణమని ఎల్ అండ్ టీ, మెట్రో రైల్ ఎండి కేవీబీ రెడ్డి అన్నారు. ఈ సౌకర్యాన్ని కార్పోరేట్ సంస్ధలు ఉపయోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు .
ఆఫీస్ బబుల్స్ సదుపాయాలు