Income Tax Payers | పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారు భారీగా పెరిగారు. సోమవారం లోక్సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గణాంకాలే చెబుతున్నాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో కోటి మంది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు పెరిగారు. 2016 నవంబర్ రాత్రి ఎనిమిది గంటలకు జాతినుద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. పాత రూ.1000, రూ.500 విలువైన నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
నల్లధనం వెలికి తీయడంతోపాటు అవినీతిపై పోరాటానికి 86 శాతంగా ఉన్న (రూ.1000, రూ.500 పాత పెద్దనోట్లు) కరెన్సీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం పాత పెద్ద నోట్లరద్దు నిర్ణయం చెల్లుబాటవుతుందని గత నెలలో ప్రకటించింది. ఆర్బీఐతో సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నదని గుర్తు చేసింది.
2016-17 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ టాక్స్ చెల్లింపుదారులు 32.5 శాతం పెరిగారని తెలుస్తున్నది. 2014లో ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 60 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులు పెరుగడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కారణమేమీ వెల్లడించలేదు. ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణ, మెరుగ్గా టెక్నాలజీ వినియోగం, అధిక ఖర్చు చేసేవారిని గుర్తించడం, రద్దైన పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం వంటి కారణాల వల్ల పన్ను చెల్లింపు దారులు పెరిగారని అధికారులు తెలిపారు.
ఆదాయం పన్ను రిటర్న్స్ దాఖలు ప్రక్రియ సరళతరం చేయడం కూడా కారణం అని అధికార వర్గాలు తెలిపాయి. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ కొత్తగా రూ.2000 విలువైన నోటు, రూ.500 విలువైన నోటు జారీ చేసింది. 2016 డిసెంబర్ 30 లోపు పాత నోట్లను డిపాజిట్ చేసి కొత్త నోట్లు తీసుకోవాలని కేంద్రం సూచించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను వసూళ్లు రూ.2.58 లక్షల కోట్ల నుంచి రూ.6.73 లక్షల కోట్లకు పెరిగాయని పార్లమెంట్కు కేంద్ర ఆర్థికశాఖ అందజేసిన సమాచారం చెబుతున్నది. కార్పొరేట్ ఇన్కం టాక్స్ రూ.4.28 లక్షల కోట్ల నుంచి రూ.7.12 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది. 66 శాతానికి పైగా గ్రోత్ నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి.