న్యూఢిల్లీ, మే 20: దేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీసీ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.5,199.51 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. ఆదాయం అధికంగా సమకూరడం వల్లనే లాభాల్లో 12 శాతం వృద్ధి నమోదైందని వివరించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.4,649.49 కోట్ల లాభాన్ని గడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.31,687.24 కోట్ల నుంచి రూ.37,724.42 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. మరోవైపు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రూ.3 తుది డివిడెండ్ను ప్రకటించింది. ఫిబ్రవరిలో చెల్లించిన రూ.4 మధ్యంతర డివిడెండ్కు ఇది అదనం. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.13,49,94.31 కోట్ల ఆదాయంపై రూ.16,960.29 కోట్ల నికర లాభాన్ని గడించింది. సరాసరి పవర్ టారిఫ్ యూనిట్కు రూ.3.77 నుంచి రూ.3.98కి పెరిగినట్లు తెలిపింది.
గడిచిన త్రైమాసికంలో బొగ్గు సరఫరా పెరగడంతో విద్యుదుత్పత్తి అంతకంతకు పెరిగినట్లు వెల్లడించింది. మార్చి త్రైమాసికంలో 52.28 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును విద్యుత్ ప్లాంట్కు సరఫరా జరిగిందని తెలిపింది. మరోవైపు 1.08 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గును కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు తెలిపింది. 2021-22లో 299.18 బిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసింది.