నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) కో-లొకేషన్ స్కాం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తు తీవ్రతరం చేసింది. శనివారం దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సోదాలు చేపట్టింది. ముంబై, ఢిల్లీ, నొయిడా, గురుగ్రామ్, కోల్కతా తదితర నగరాల్లోని 12 చోట్లు ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్ఈ కో-లొకేషన్ స్కామ్ కేసుతో సంబంధం ఉన్న స్టాక్ బ్రోకర్ల నివాసాలు, కార్యాలయాలపై తనిఖీలు జరిగినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఎన్ఎస్ఈ మాజీ సీఈవో-ఎండీ చిత్రా రామకృష్ణ, మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణ్యన్లపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
2010-15 మధ్య జరిగిన పరిణామాల నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఎన్ఎస్ఈలో ఓపీజీ సెక్యూరిటీస్ వ్యవహారాల నిర్వాహకురాలిగా చిత్ర రామకృష్ణ ఉన్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో 670 ట్రేడింగ్ రోజుల్లో సెకండరీ పీవోపీ సర్వర్ చిత్రా రామకృష్ణ పర్యవేక్షణలో ఉంది. ఆ టైంలో ఎన్ఎస్ఈ సర్వర్లపై కొంత మంది బ్రోకర్లకు యాక్సెస్ తెలుసుకునేందుకు ఆస్కారం ఇచ్చారన్న కోణంలోనూ దర్యాప్తు సాగనున్నది. ఎన్ఎస్ఈలో గుర్తు తెలియని అధికారులతో కలిసి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.