NSE on Adani | అదానీ గ్రూప్ అనుబంధ సంస్థలకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అంబుజా సిమెంట్స్ సంస్థల ట్రేడింగ్పై పెట్టిన నిఘాను ఉపసంహరిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో అదానీ స్టాక్స్ భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో ఆ షేర్ల ట్రేడింగ్ మీద ఏఎస్ఎం ఫ్రేమ్ వర్క్ నిఘా ప్రకటించింది. దీంతో అదానీ గ్రూప్ సంస్థల్లోని అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్లకు తదుపరి పతనం తప్పింది. తాజాగా ఏఎస్ఎం నిఘా ఎత్తేయడంతో ఆ రెండు సంస్థల షేర్లు మరింత పతనం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదానీ గ్రూపులోని అత్యధిక సంస్థలు శుక్రవారం మరింత పతనం అయ్యాయి. ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ నాలుగు శాతం నష్టాన్ని చవిచూసింది. అదానీ గ్రూపుల ఫ్రీ-ఫ్లోట్ వెయిట్లో కోత విధిస్తూ ఎంఎస్సీఐ నిర్ణయంతో శుక్రవారం అదానీ స్టాక్స్లో రెండు మినహా అన్ని నష్టపోయాయి. శుక్రవారం అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 3.3 శాతం నష్టపోయింది. జనవరి 24 నుంచి అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 51 శాతం పతనమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసానీ చెప్పారు.