హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 8: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) హైదరాబాద్లో కొత్తగా మరో భవనాన్ని నిర్మిస్తున్నది. ఇప్పటికే ఐటీ కారిడార్లో సుమారు రూ.500 కోట్ల పెట్టుబడితో స్మార్ట్ డాటా సెంటర్ను నిర్మిస్తున్న సంస్థ..దీనికి దగ్గర్లోనే మరో భవనం నిర్మాణాన్ని చేపట్టింది. 16 అంతస్తులతో నిర్మించబోయే భవంతికి అన్ని రకాల అనుమతులు కూడా లభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఎన్పీసీఐ ముందుకొచ్చింది. గతేడాది డాటా సెంటర్ కోసం ఐటీ కారిడార్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్లో కేసీఆర్ ప్రభుత్వం 3.5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అందులో ఇప్పటికే నాలుగు అంతస్తుల్లో కార్యకలాపాలు ప్రారంభించగా..తాజాగా దీనికి అనుకొని మరో 16 అంతస్తుల భవనాన్ని నిర్మించబోతున్నది. పెరుగుతున్న డిజిటల్ కార్యకలాపాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 3,938 చదరపు మీటర్ల స్థలంలో 16 అంతస్థుల భవనాన్ని నిర్మించేందుకు పర్యావరణ అనుమతులను కూడా లభించాయి.