Rs. 2000 Note | రూ.2000 విలువైన నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు గడువు శనివారంతో ముగిసిపోనున్నది. ఇప్పటికీ బహిరంగ మార్కెట్లో రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. అవి ఇంకా బ్యాంకులకు చేరలేదు. తొలుత సెప్టెంబర్ 30 వరకూ రూ.2000 నోట్ మార్పిడి లేదా డిపాజిట్కు అవకాశం ఇచ్చిన ఆర్బీఐ.. తర్వాత గడువు ఈ నెల ఏడో తేదీకి పొడిగించింది.
కానీ, మరో రూ.12 వేల కోట్ల విలువైన నోట్లు మార్కెట్లోనే చలామణిలో ఉన్నాయని శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. సోమవారం నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద మాత్రమే మార్చుకునేందుకు వీలు ఉందని కూడా శక్తికాంత దాస్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఆర్బీఐకి 19 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఒకేసారి రూ.20 వేల వరకూ డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. పోస్టాఫీసుల ద్వారా కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపవచ్చు. అలా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు రూ.2000 నోట్లు పంపిన వారి బ్యాంకు ఖాతాలో ఆ నోట్ల విలువ సొమ్ము క్రెడిట్ అవుతుంది.
ఇప్పటి వరకూ 96 శాతం రూ.2000 నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. వాటి విలువ రూ.3.43 లక్షల కోట్లు. అందులో 87 శాతం నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్లు, మిగతా నోట్లు ఇతర డినామినేషన్ నోట్లతో మార్చుకున్నారు. 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం, ప్రజల్లో చలామణి కోసం రూ.2000 నోటు తీసుకొచ్చింది. 2018-19లో రూ.2000 నోట్ల ముద్రణ నిలిపేశారు. 2021-22లో రూ.38 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ధ్వంసం చేశారు.