న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ నుంచి గట్టి షాక్ తగిలింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటిలిజెన్స్ (డీజీజీఐ) షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఈ నోటీసుల్లో ఒకే కంపెనీ&ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ డ్రీమ్ 11కు జారీ అయిన రూ.25,000 కోట్ల పన్ను నోటీసు ఉన్నది. దేశంలో ఇప్పటివరకూ జారీఅయిన పరోక్ష పన్ను నోటీసులో ఇదే అతిపెద్దది. గతంలో గేమ్స్క్రాఫ్ట్కు జారీఅయిన రూ.21,000 కోట్ల నోటీసు ఇప్పటివరకూ పెద్దదికాగా, దీనిపై కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోపుగా సెప్టెంబర్ 16న గేమ్స్క్రాఫ్ట్ తన సూపర్యాప్ గేమ్జీని షట్డవున్ చేసింది.
రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలకు జీఎస్టీ డిమాండ్ నోటీసుల్ని డీజీజీఐ ఇస్తుందని, ఆర్ఎంజీ కంపెనీలు చెల్లించాల్సిన మొత్తం రూ. 1 లక్ష కోట్లకు చేరుతుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. తాజాగా నోటీసులు అందుకున్న కంపెనీల్లో ప్లే గేమ్స్ 24X7, దాని అనుబంధ సంస్థలు, హెడ్ డిజిటల్ వర్క్స్లు ఉన్నాయని సంబంధిత వ్యక్తులు వెల్లడించారు. ప్లేగేమ్స్ 24X7, దాని అనుబంధ సంస్థలు రమ్మీ సర్కిల్, మై 11 సర్కిల్ తదితరాలపై రూ.20,000 కోట్ల పన్ను నోటీసులు జారీ అయ్యాయి. రూ.5,000 కోట్లు చెల్లించాలంటూ హై డిజిటల్ వర్క్స్కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. అయితే ఈ అంశంపై వ్యాఖ్యానించేందుకు ప్లే గేమ్స్ 24X7, హెడ్ డిజిటల్ వర్క్స్ నిరాకరించాయని ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.
జీఎస్టీ రేట్లలో మార్పులతోనే&రియల్ మనీ గేమ్స్పై జీఎస్టీలో చేసిన మార్పుల నేపథ్యంలో డీజీజీఐ నోటీసులు జారీచేసింది. ఆర్ఎంజీ ప్లాట్ఫామ్స్పై ప్రతీ గేమ్ సెషన్కు జరిగే మొత్తం బెట్ మీద గూడ్స్ సర్వీసుల పన్నును ఇటీవల 28 శాతానికి పెంచారు.