న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: వివాదంలో విలవిలలాడుతున్న అదానీ గ్రూప్లో పెట్టుబడులను పూర్తిగా ఉపసంహరించుకున్నట్టు నార్వే ప్రభుత్వానికి చెందిన వెల్త్ ఫండ్ ప్రకటించింది. 2022 చివరినాటికి ఈ నార్వేజియన్ ఫండ్ వద్ద 52.7 మిలియన్ డాలర్ల విలువైన అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు, 83.6 మిలియన్ డాలర్ల అదానీ టోటల్ గ్యాస్ షేర్లు, 63.4 మిలియన్ డాలర్ల అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు ఉన్నాయి. వీటి మొత్తం విలువ రూ. 1,800 కోట్లు.
ఈ షేర్లన్నింటినీ ఇటీవలి వారాల్లో విక్రయించినట్టు నార్వే సావరిన్ వెల్త్ ఫండ్ ఈఎస్జీ రిస్క్ మానిటరింగ్ హెడ్ క్రిస్టోఫర్ రైట్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈఎస్జీ (ఎన్విరాన్మెంట్, సోషల్, గవర్నెన్స్) అంశాలపై ఎన్నో ఏండ్లుగా అదానీని తాము సునిశితంగా గమనిస్తున్నామని, 2014 నుంచి 2022 వరకూ ఐదు అదానీ కంపెనీల షేర్లను విక్రయించామని, అప్పటి నుంచి మరో మూడు కంపెనీల షేర్ల నుంచి సైతం వైదొలిగామని, ఇక ఆ గ్రూప్లో తమకు వాటాలేవీ లేవని వివరించారు.