Nirmala Sitaraman | పెట్టుబడులపై సూచనలు ఇచ్చే ఫైనాన్సియల్ ఇన్ఫ్లూయెన్సర్ల నియంత్రణకు ప్రభుత్వం వద్ద ఎటువంటి ప్రతిపాదన లేదని కేంద్ర నిర్మలా సీతారామన్ చెప్పారు. సోషల్ మీడియాలో సూచనలు చేసే ఆర్థిక ప్రభావ శీలురి (Financial Influencers) సూచనలు పాటించడం వల్ల నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆదివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఫైనాన్సియల్ ఇన్ఫ్లూయెన్సర్లలో చాలా మంది తప్పుడు ఉద్దేశాలతో ఫ్రాడ్ స్కీమ్లను ప్రోత్సహిస్తుంటారన్నారు. అటువంటి స్కీమ్ల్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రజలు జాగ్రతగా ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.
ఫైనాన్సియల్ ఇన్ఫ్లూయెన్సర్లలో ప్రజలకు మంచి సూచనలు ఇచ్చే వారిలో ముగ్గురు లేదా నలుగురు ఉంటారని, మోసగించే వారు ఆరేడుగురు ఉంటారని నిర్మలా సీతారామన్ హెచ్చరించారు. ఇప్పుడు ఆర్థిక సలహాలు ఇవ్వడానికి కొన్ని యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. ఫలానా స్కీమ్లో పెట్టుబడులపై ఇన్ని రెట్లు మీ డబ్బు పెరుగుతుందని గుడ్డి లెక్కలు చెబుతారని వాటిలో చాలా వరకు మోసపూరితమేనని అన్నారు. కనుక పెట్టుబడుల మదుపుపై ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని నిర్ణయానికి రావాలని సూచించారు.
మోసపూరిత యాప్స్ను నియంత్రించడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఉమ్మడిగా కృషి చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. కష్టపడి ప్రజలు సంపాదించే సొమ్ముకు రక్షణ కల్పించడానికి కేంద్రం తన వంతు చర్యలు తీసుకుంటుందన్నారు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరిగిందన్నారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో పెట్టుబడులకు ప్రజలు ఆల్టర్నేటివ్ రూట్లు వెతుకుతున్నప్పుడే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు ముందుకు వస్తున్నారన్నారు.
ఆర్థికాంశాలపై అవగాహన లేక ఫైనాన్సియల్ ఇన్ఫ్లూయెన్సర్లపై ఆధార పడటాన్ని అలుసుగా తీసుకొని కొందరు సోషల్ మీడియా వేదికల్లో తమకు తోచిన సలహాలు ఇస్తున్నారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ సలహాలు పాటించిన వారు మోసపోతున్నారన్నారు. డిస్క్లయిమర్లు లేకుండా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యే వివిధ వీడియోలను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, వాటిని పోస్ట్ చేసిన వారిపై త్వరలోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.